కార్పొరేటర్ వర్సెస్ యువతి
ABN, First Publish Date - 2020-09-14T09:51:03+05:30
ఓ కార్పొరేటర్ ఇంటి ఎదుట ఉన్న పార్కింగ్ విషయంలో దాడి చేశాడని, న్యాయం చేయాలని ఓ యువతి మంత్రి
రోడ్డుకు అడ్డంగా కార్పొరేటర్ కారు
పక్కకు తీయాలన్న యువతి.. ఇరువురి మధ్య వాగ్వాదం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): ఓ కార్పొరేటర్ ఇంటి ఎదుట ఉన్న పార్కింగ్ విషయంలో దాడి చేశాడని, న్యాయం చేయాలని ఓ యువతి మంత్రి కేటీఆర్కు ట్విటర్లో ఫిర్యాదు చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన శేరిలింగంపల్లిలో శనివారం రాత్రి 10.30 గంటలకు జరిగింది. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్యాదవ్ నల్లగండ్లలోని లక్ష్మీవిహార్ ఫేజ్-2లో నివాసం ఉంటున్నాడు.
శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటి ఎదురుగా ఉండే ఓ యువతి తన కారులో వచ్చింది. అయితే అప్పటికే అక్కడ రోడ్డుపై చాలాకార్లు నిలిపి ఉన్నాయి. అందులో యువతి ఇంటి ఎదురుగా నాగేందర్యాదవ్కు చెందిన రెండు వాహనాలు ఉన్నాయి. కాలనీ సెక్యూరిటీని తీసుకొచ్చిన సదరు యువతికార్పొరేటర్ను పిలిచి కార్లను తీయాలని కోరింది. ఈ విషయంలో యువతికి, ఆమె తండ్రి, కార్పొరేటర్ మధ్య వాగ్వాదం జరిగింది. నాగేందర్ యాదవ్ యువతి తండ్రితో మాట్లాడుతుండగా సదరు యువతి, ఆమె సోదరి చేరోవైపు నుంచి ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు. దీన్ని గమనించి కార్పొరేటర్ వారిని అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు కల్పించుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ విషయాన్ని సదరు యువతి సోషల్మీడియాలో పోస్టు చేయగా వైరల్గా మారింది.
కార్పొరేటర్ నాగేందర్యాదవ్పై చందానగర్ పీఎ్సలో ఫిర్యాదు
నల్లగండ్ల లక్ష్మీవిహార్ ఫేజ్-2లో నివాసం ఉండే అనూన్య కార్పొరేటర్ నాగేందర్యాదవ్పై చందానగర్ ఠాణాలో ఆదివారం ఫిర్యాదు చేసింది. అనూన్య శనివారం రాత్రి 10.30 గంటలకు తన కారులో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంటి ఎదుట ఉన్న కారు పార్కింగ్ విషయంలో నాగేందర్యాదవ్కు అనూన్యకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని అనూన్య తన మొబైల్లో వీడియో తీస్తుండగా ఎందుకు తీస్తున్నావని నాగేందర్యాదవ్ ఫోన్ను లాక్కోవడానికి రాగా అతడి చెయ్యి తన చెంపపై తాకినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్సై హమీద్పాష తెలిపారు.
Updated Date - 2020-09-14T09:51:03+05:30 IST