భారీవర్షం..
ABN, First Publish Date - 2020-06-01T08:35:41+05:30
నైరుతి రుతుపవనాలు రాకముందే తెలంగాణలో కుండపోత కురిసింది. ఓ వైపు రోహిణికార్తెలో భానుడు భగ్గుమంటుండగా.. మరోవైపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది.
- హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయం
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
- పిడుగుపాటుకు ఒకరి దుర్మరణం
- 30 గొర్రెలు.. 18 మేకలు మృత్యువాత
- అరేబియా సముద్రంలో అల్ప పీడనం
- తుఫానుగా మారే అవకాశం
- మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
నైరుతి రుతుపవనాలు రాకముందే తెలంగాణలో కుండపోత కురిసింది. ఓ వైపు రోహిణికార్తెలో భానుడు భగ్గుమంటుండగా.. మరోవైపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. సంగారెడ్డి జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులు, వడగళ్ల వాన పడింది. వికారాబాద్ జిల్లాలో గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దౌల్తాబాద్ మండలం బిచ్చాల్ గ్రామ శివారులో పిడుగుపడి 18 మేకలు మృత్యువాతపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలి దుమారంతో కూడిన వర్షం పడింది.
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో గంటసేపు భారీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వాన పడింది. నల్లగొండ జిల్లా బీ.వెల్లెంల గ్రామానికి చెందిన గెల్లె మల్లయ్య(65) మేకలు కాస్తుండగా నార్కట్పల్లిలో పిడుగుపాటుకు మృతిచెందాడు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. కుమరం భీం జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వాన కురిసింది. మంచిర్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. గ్రేటర్ హైదరాబాద్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రెండు గంటలపాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పటాన్చెరులో అత్యధికంగా 6.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. నగరవ్యాప్తంగా 16 మి.మీ వర్షపాతం నమోదైంది.
అరేబియాలో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం
ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ‘‘ఆదివారం ఉదయమే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 24 గంటల్లో వాయుగుండంగా, తదుపరి 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉం ది. ఇది ఉత్తర దిశగా ప్రయాణించి 3కల్లా ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాన్ని చేర నుంది. దీంతో రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది’’ అని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలో తడిసిన ధాన్యం బస్తాలు
హైదరాబాద్ మలక్పేట్లో వాహనదారుల కష్టాలు
Updated Date - 2020-06-01T08:35:41+05:30 IST