ముంచెత్తిన వాన.. నీట మునిగిన పంటలు
ABN, First Publish Date - 2020-07-30T07:11:58+05:30
ముంచెత్తిన వాన.. నీట మునిగిన పంటలు
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్ : రాష్ట్రంలోని పలు జిల్లాలను బుధవారం భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక చోట్ల నీటి ఉధృతికి రహదారులు తెగిపోయి రాకపోకలు స్తంభించాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ధరూర్, కేటీదొడ్డి మండలాల్లో 300 ఎకరాల్లో పత్తి, 200 ఎకరాల్లో వరి ముంపునకు గురైంది. కాల్వలకు గండ్లు పడ్డాయి. రూ. 20 లక్షల మేర పంటలకు నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా మామడ మండలంలో వాగు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. బ్రిడ్జిలపై నుంచి నీరు పొంగి పొర్లడంతో పిట్లం-నారాయణ ఖేడ్కు రాకపోకలు స్తంభించిపోయాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో పొలాలు ముంపునకు గురయ్యాయి.
మేడిగడ్డలో 10.88 టీఎంసీల నీరు
మేడిగడ్డ బ్యారేజీలో 10.88 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీలోకి 50 వేల 500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 35 గేట్లను ఎత్తి 77,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Updated Date - 2020-07-30T07:11:58+05:30 IST