చేనేతకు పెహచాన్
ABN, First Publish Date - 2020-10-27T11:22:25+05:30
కులవృత్తిని నమ్ముకొని ఏళ్ల తరబడి మగ్గాలు నేస్తున్నా నేతన్నలకు సరైన గుర్తింపు లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ ఫలాలు అందడం లేదు
కేంద్రం నుంచి త్వరలో గుర్తింపు కార్డులు
జియోట్యాగ్ కలిగి ఉన్న మగ్గాలకు వర్తింపు
సర్వీస్ కేంద్రాల ద్వారా వివరాల నమోదు
కార్మికులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి లబ్ధి
హన్మకొండ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కులవృత్తిని నమ్ముకొని ఏళ్ల తరబడి మగ్గాలు నేస్తున్నా నేతన్నలకు సరైన గుర్తింపు లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ ఫలాలు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ, కేంద్రం అమలు చేసే పథకాలకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని గుర్తించిన కేంద్రం దేశవ్యాప్తంగా చేనేత కార్మికులందరికీ ఒకే విధమైన గుర్తింపుకార్డును ఇచ్చేందుకు చర్యలు చేపడుతోంది. త్వరలో ‘పెహచాన్’ పేరుతో గుర్తింపుకార్డు ఇవ్వనున్నారు. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో ఇది అమలవుతుండగా మన రాష్ట్రంలోనూ ఇవ్వనున్నారు. దీనిపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం చేనేత సర్వీస్ కేంద్రం వారు కార్మికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
జెమ్ వెబ్సైట్
ప్రైవేటు ఈ-కామర్స్ సంస్థల మాదిరిగానే ప్రభుత్వం కూడా జెమ్ (గవర్నమెంట్ ఈ-మార్కెటింగ్) పేరుతో ఈకామర్స్ వెబ్సైట్ నిర్వహిస్తోంది. ఇందులో పేరు నమోదు చేసుకున్న కార్మికు లు ఆన్లైన్లో మార్కెటింగ్ చేసేలా అవకాశం కల్పిస్తోంది. ఇం దుకు పేర్ల నమోదు చేసుకొని ఆన్లైన్ మార్కెటింగ్ అవకాశంతో పాటు, పెహచాన్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,855 జియోట్యాగ్ కలిగిన మగ్గాలున్నాయి. వీటిలో వరంగల్ అర్బన్ జిల్లాలో ఎక్కువగా 2,150 ఉన్నాయి. వరంగల్రూరల్ జిల్లాలో 823, జనగామ జిల్లాలో 735, ములుగు జిల్లాలో 15, జయశంకర్భూపాలపల్లి జిల్లాలో 823, మహబూబాబాద్ జిల్లాలో 99 ఉన్నాయి. జియోట్యాగ్ అయిన కార్మికులందరినీ జెమ్ పోర్టల్లో నమోదు చేసి, గుర్తింపుకార్డు ఇవ్వనున్నారు.
సమగ్ర వివరాలతో..
2018లో కార్వీ సంస్థ వారు జియోట్యాగ్ కలిగిన ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలను నమోదు చేశారు. కార్మికుడి ఫొటో, సెల్ నెంబర్, ఆధార్ నెంబర్, జియోట్యాగ్ తదితర వివరాలను పొందుపరిచారు. వీటి ఆధారంగా ప్రస్తుతం కేంద్ర వస్త్ర, చేనేత మంత్రిత్వ శాఖ వారు కార్మికులకు గుర్తింపుకార్డులు అందించనున్నారు. చేనేత సర్వీస్ సెంటర్కు చెందిన అధికారులు నేరుగా లేదా ఫోన్ ద్వారా సంప్రదిస్తే.. జెమ్ పేరుతో సెల్నెంబర్కు వచ్చే మెసేజ్లో ఓటీపీ చెబితే అన్ని వివరాలు నిక్షిప్తం చేస్తారు. తర్వాత వారికి కొన్ని రోజులకు ఫొటో, ఇంటి నెంబర్, ఇతర వివరాలతో కూడిన గుర్తింపుకార్డులను అందజేస్తారు. కార్డు ఆధారంగానే. కేంద్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేయనున్నారు. బ్యాంకు రుణాలు, ఆన్లైన్ మార్కెటింగ్, ఎగ్జిబిషన్లో మార్కెటింగ్, ప్రభుత్వ పథకాలకు ఇది ఉపయోగపడతుంది.
సంక్షేమ పథకాలు..
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ పహచాన్ కార్డు ద్వారా పొందవచ్చు.ముఖ్యంగా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ఆమ్ఆద్మీ బీమా యోజన, ముద్ర పథకం, జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్హెచ్డీపీ), సమగ్ర చేనేత క్లస్ట ర్ అభివృద్ధి పథకాన్ని పొందవచ్చు. అలాగే (సీహెచ్సీడీఎస్), చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం (హెచ్డబ్ల్యూసీడబ్ల్యూఎ్స), హత్కర్గా సంవర్ధన్ సహాయత (హెచ్ఎ్సఎ్స), నూ లు సరఫరా పథకం (వైఎ్సఎస్) వీటిలో ఉన్నాయి. చేనేత కార్మికులు పెహచాన్ కార్డు ద్వారా ఈ పథకాల లబ్ధిని పొందవచ్చు.
పెహచాన్ కార్డు అంటే..?
చేనేత కార్మికులు, చేతివృత్తులవారి పేర్లను నమోదు చేసుకొని వారికి కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ జారీ చేసే ఒక ప్రత్యేక ఒక గుర్తింపు కార్డు ఇది. పెహచాన్ కార్డులో పొందుపరిచిన వివరాలను జాతీయ డాటాబే్సతో అనుసంధానిస్తారు. ఈ కార్డును ఆధార్కార్డు, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా చేనేత కార్మికులకు అందుతాయి. సర్వీస్ సెంటర్ ద్వారా పేర్లు నమోదుచేసుకున్న చేనేత కార్మికులకు రెండు మాగ్నెటిక్ కార్డులను ఇస్తారు. ఒకటి చేనేత కార్మికుడికి. రెండోది ఆయన కుటుంబ సభ్యులకు. కేంద్ర డాటాబేస్ చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యుల డోమోగ్రాఫిక్, బయోమెట్రిక్ వివరాలను సేకరించి సెంట్రల్ డాటాబే్సలో పొందుపరుస్తుంది. దీంతో కార్మికులు దేశ్యాప్తంగా ఎక్కడైనా ఈఎ్సఐ ఆస్పత్రిలో లేదా దవాఖానాలో వైద్యసేవలు పొందవచ్చు. చేనేత వస్త్రాల ఉత్పత్తికి నాలుగు శాతం వడ్డీరేటుపై రుణాలను సులభంగా పొందవచ్చు. జీవిత బీమా సౌకర్యం కూడా వర్తిస్తుంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కార్మికుల పిల్లలకు సంవత్సరానికి రూ.1200 స్కాలర్షిప్ కూడా లభిస్తుంది.
Updated Date - 2020-10-27T11:22:25+05:30 IST