షార్ట్సర్క్యూట్తో దుకాణాల దగ్ధం
ABN, First Publish Date - 2020-12-12T04:33:43+05:30
షార్ట్సర్క్యూట్తో దుకాణాల దగ్ధం
కృష్ణకాలనీ, డిసెంబరు 11 : భూపాలపల్లిలోని అంబేద్కర్సెంటర్ కూడలి ఉన్న మూడు షాపులు శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమయ్యాయి. పట్టణానికి చెందిన బాబూరావుకు చెందిన జ్యూస్ పాయింట్, చిరుమల్ల రాజేశంకు చెందిన జిరాక్స్ అండ్ పాన్షాపు, రంజిత్కు చెందిన పాన్షాపు కాలిపోయాయి. తొలుత ఒకషాపులో చెలరేగిన మంటలు పక్కన ఉన్న రెండుషాపులకు విస్తరించాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైరింజన్ అక్కడకు చేరుకొని మంటలను ఆర్పింది. సంఘటనా స్థలాన్ని ఎస్సై అభినవ్ చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 4 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
పరామర్శించిన ఎమ్మెల్యే.. ఏఐఎ్ఫబీ నేత
షార్ట్ సర్క్యూట్తో షాపులు దగ్ధమైన యజమానులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఏఐఎ్ఫబీ నేత గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు. సంఘటనా స్థలానికి వేర్వేరుగా చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. బాధితులకు ధైర్యం చెప్పారు. నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సాయమందేలా చూస్తానని ఎమ్మెల్యే గండ్ర భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో మునిసిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ హరిబాబు, పట్టణ అధ్యక్షుడు సాంబమూర్తి, ఏఐఎ్ఫబీ నేతలు దాట్ల శ్రీనివాస్, కురిమిళ్ల శ్రీనివాస్, సహదేవ్, తోట రంజిత్, మహేందర్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2020-12-12T04:33:43+05:30 IST