పాస్ పుస్తకం కోసం రైతు ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2020-08-13T07:55:09+05:30
తమకు వారసత్వంగా వచ్చిన భూమికి పాస్ పుస్తకం ఇవ్వకుండా అధికారులు ఏళ్ల తరబడి
- నేలకొండపల్లి తహసీల్దార్ ఆఫీసు వద్ద ఘటన
నేలకొండపల్లి, ఆగస్టు 12 : తమకు వారసత్వంగా వచ్చిన భూమికి పాస్ పుస్తకం ఇవ్వకుండా అధికారులు ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నారని మనస్థాపానికి గురైన ఓ యువ రైతు తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బుధవారం జరిగింది. రాజేశ్వరపురం గ్రామానికి చెందిన మునగంటి పుల్లయ్యకు 385 సర్వే నెంబరులో ఎకరం భూమి ఉంది. పుల్లయ్యతోపాటు ఆయన కుమారులు కనకయ్య, శ్రీనులు ఇది వరకే చనిపోయారు. అయితే, పుల్లయ్య పేరిట ఉన్న భూమికి పాస్ పుస్తకాలు లేకపోవడంతో నాలుగేళ్లుగా కనకయ్య, శ్రీను కుమారులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో తాము రైతు బీమా, రైతుబంధుకు నోచుకోలేకపోతున్నామని, తమకు వారసత్వంగా వచ్చిన భూమికి పాస్పుస్తకాలు ఇవ్వాలని శ్రీను కుమారుడు లక్ష్మీనారాయణ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే తమ రికార్డుల్లో భూమి లేదని, సర్వే చేయించుకోవాలంటూ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో విసిగిపోయిన లక్ష్మీనారాయణ బుధవారం నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాయం వద్ద పురుగుల మందు తాగాడు. దీంతో అతడిని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
Updated Date - 2020-08-13T07:55:09+05:30 IST