వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..: హరీష్ వార్నింగ్
ABN, First Publish Date - 2020-08-03T22:05:00+05:30
కరోనా సోకిన వారిపట్ల దురుసుగా ఉండకూడదని మంత్రి హరీష్ రావు తెలిపారు.
హైదరాబాద్ : కరోనా సోకిన వారిపట్ల దురుసుగా ఉండకూడదని మంత్రి హరీష్ రావు తెలిపారు. కరోనా వచ్చిన వారితో ఇళ్లు ఖాళీ చేయించడం, ఊర్లోకి రానివ్వకపోవడం కరెక్ట్ కాదని అలా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సోమవారం నాడు నగరంలోని బేగంపేటలో జీతో కోవిడ్ కేర్ సెంటర్ను హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమం చేసిన మహావీర్, జీతో టీంకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో జైన్లు ముందుంటారని వారి సేవలను ఆయన కొనియాడారు. త్వరలోనే జైన్ కమ్యూనిటీ పెద్దలను సీఎం కేసీఆర్తో మాట్లాడి సమావేశం ఏర్పాటు చేయిస్తామని హరీష్ తెలిపారు. 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వం శక్తివంచన లేకుండా పని చేస్తోందన్నారు.
చిన్నచూపొద్దు..!
మహావీర్ ఆస్పత్రి ఆద్వర్యంలో పేదల కోసం ఇది ప్రారంభించినట్లు తెలిపారు. కరోనాను అందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని మంత్రి పిలుపునిచ్చారు. కరోనా వచ్చిన వారిపట్ల చిన్నచూపు చూడొద్దని ప్రజలకు సూచించారు. కరోనా రాకుండా అడ్డుకోవాలి అంతేకానీ వైరస్ సోకిన వారిని కాదని హరీష్ తెలిపారు. కరోనా సోకినవారిని ఊర్లలోకి రానివ్వం.. ఇళ్లు ఖాళీ చేయించడం కరెక్ట్ కాదన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా కోవిడ్ అనేది ఉందని.. దాన్ని ఎదుర్కొనే సత్తా మనకు ఉండాలన్నారు.
Updated Date - 2020-08-03T22:05:00+05:30 IST