సైబ్-హర్ మరో అద్భుతం: కేసీఆర్
ABN, First Publish Date - 2020-08-15T09:39:51+05:30
రాష్ట్రంలో మహిళా భద్రతా విభాగం చేపట్టిన ‘సైబ్-హర్’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రశంసించారు.
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళా భద్రతా విభాగం చేపట్టిన ‘సైబ్-హర్’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన ప్రస్తుత తరుణంలో మహిళలు, విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండేందుకు ‘సైబ్-హర్’ పేరుతో చేపట్టిన కార్యక్రమం మంచి అవగాహన కల్పించిందని కొనియాడారు. మహిళలు, పిల్లల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్రం.. సైబ్-హర్ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంతో మరో అద్భుతం సాధించిందన్నారు.
మహిళా భద్రత విభాగం చేపట్టిన సైబ్-హర్ కార్యక్రమాన్ని అభినందిస్తూ సీఎం కేసీఆర్ ఇటీవల రాసిన లేఖను డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. మహిళా భద్రతా విభాగం నిబద్ధత, కృషికి ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు వచ్చాయని ఆయన తెలిపారు. నెల రోజుల పాటు ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించి దాదాపు 15 లక్షల మందికి సైబర్ నేరాల తీరు, వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబ-హర్ ద్వారా అవగాహన కల్పించారు.
Updated Date - 2020-08-15T09:39:51+05:30 IST