కొద్ది మొత్తంతో వలవేసి.. పెద్ద మొత్తంలో దోచేశారు
ABN, First Publish Date - 2020-10-01T07:37:29+05:30
సైబర్ నేరగాళ్ల మాయమాటల వలలో పడిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. బీహెచ్ఈఎల్లో ఉంటున్న సదరు ఉద్యోగిని వాట్సాప్ ద్వారా విలయమ్స్....
27లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
హైదరాబాద్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల మాయమాటల వలలో పడిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. బీహెచ్ఈఎల్లో ఉంటున్న సదరు ఉద్యోగిని వాట్సాప్ ద్వారా విలయమ్స్ అనే వ్యక్తి సంప్రదించాడు. స్టార్ ట్రేడ్, రాయల్స్టాండ్ ట్రేడింగ్ కంపెనీల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే ఊహకందని లాభం ఉంటుందని నమ్మించాడు. ఇంకేముంది.. భలేచాన్సు అనుకున్న ఆ ఉద్యోగి.. రాయల్ స్టాండర్డ్ బ్యాంక్లో ఖాతా తెరిచాడు. మొదట 40డాలర్లను డిపాజిట్ చేశాడు. తన ఖాతాలో 2 రోజుల్లో 48డాలర్లు జమయ్యాయి. ఆ తర్వాత 1000 డాలర్లు డిపాజిట్ చేయ గా.. కొద్దిరోజుల్లోనే మరో 2వేల డాలర్లు పడ్డాయి. వాటిని బాధితుడు విత్డ్రా చేసుకున్నాడు. తమ కంపెనీలో ప్రస్తుతం ప్రొమో ఆఫర్ నడుస్తోందని.. 10వేల డాలర్లు ట్రేడింగ్ చేస్తే వారం రోజుల్లోగా 80వేల డాలర్లు జమవుతాయని విలయమ్స్ చెప్పా డు. దీంతో ఆ ఉద్యోగి 10వేల డాలర్లు పంపాడు. తర్వాత 80వేల డాలర్లు పడినట్లు రాయల్ స్టాండర్డ్ బ్యాంకు ఖాతా చూపించింది. అయితే, వాటిని విత్డ్రా చేసుకోవాలంటే వివిధ ట్యాక్సులు చెల్లించాలని విలియమ్స్ చెప్పాడు. ఏకంగా 60 లక్షలు తన ఖాతా లో జమ అయ్యాయనే సంతోషంతో.. విడతలవారీగా రూ.27లక్షలను సైబర్ దొంగలు చెప్పిన విధంగా 7 బ్యాంక్ ఖాతాల్లో ఆ ఉద్యోగి జమ చేశాడు. అంతటితో కథ ముగిసింది. మోసపోయానని గ్రహించిన ఆ ఉద్యోగి.. సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
Updated Date - 2020-10-01T07:37:29+05:30 IST