వైద్యుల దంపతులకు కరోనాతో.. దోమలగూడలో ఆందోళన
ABN, First Publish Date - 2020-03-27T09:38:53+05:30
వైద్యుల దంపతులకు కరోనా పాజిటివ్ అని తేలడం నగరంలోని దోమలగూడలో గురువారం కలకలం రేపింది. దీంతో జిల్లా వైద్య బృందాలు. జీహెచ్ఎంసీ సిబ్బంది..
ఇటీవల తిరుపతి వెళ్లివచ్చిన కుటుంబం?
కవాడిగూడ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): వైద్యుల దంపతులకు కరోనా పాజిటివ్ అని తేలడం నగరంలోని దోమలగూడలో గురువారం కలకలం రేపింది. దీంతో జిల్లా వైద్య బృందాలు. జీహెచ్ఎంసీ సిబ్బంది.. వైద్యులు నివసిస్తున్న అపార్ట్మెంట్కు చేరుకున్నారు. ఆ ఫ్లాట్లో వారితో పాటు ఎవరెవరు ఉంటున్నారు? ఇటీవల విదేశాలకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చారా? అనే విషయాలు తెలుసుకున్నారు. ఈ వైద్యుల దంపతులు సోమాజిగూడలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు, కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటున్నారు. డాక్టర్ దంపతులు, వారి తల్లిదండ్రులు గురువారం ఉదయం11.30 గంటల ఫ్లాట్కు తాళం వేసి కిందకు దిగారు. కొద్దిసేపటికే ఓ వాహనం వచ్చి వారిని తీసుకెళ్లింది. కాగా, కుటుంబ సభ్యులంతా ఇటీవల తిరుపతి వెళ్లి వచ్చారు. అక్కడ సెకండ్ కాంటాక్ట్ ద్వారా వైరస్ బారినపడ్డారా? లేదా ఆయన పనిచేస్తున్న ఆసుపత్రిలో రోగుల నుంచి సోకిందా అనే అంశంపై వైద్యాధికారులు విచారణ సాగిస్తున్నారు.
ఇద్దరు కరోనా అనుమానితులు గాంధీకి తరలింపు
దోమకొండ, మార్చి 26: కామారెడ్డి జిల్లా దోమకొండ, బీర్కూర్ మండలాలకు చెందిన ఇద్దరు కరోనా అనుమానితులను గురువారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక వ్యక్తి ఈ నెల 14న దుబాయ్ నుంచి వచ్చాడు. బీర్కూర్ మండల మహిళ కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతోంది.
Updated Date - 2020-03-27T09:38:53+05:30 IST