నగేష్ దృష్టంతా ఆదాయంపైనే!
ABN, First Publish Date - 2020-10-01T08:03:07+05:30
తాజా మాజీ అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ లంచం కేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనూ పలు భూ.....
గతంలో అనుమతి పొందిన ఇసుక రీచ్లపై పునఃసమీక్ష
ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనేదానిపై ఏసీబీ ఆరా
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తాజా మాజీ అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ లంచం కేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనూ పలు భూ వ్యవహారాలకు సంబంధించి బాధితుల నుంచి భూములు రాయించుకున్నట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే రెండు ఇసుక రీచ్లకు సంబంధించి ఓ మాజీ అధికారి ఇచ్చిన అనుమతులపై ఆయన పదవీ విరమణ తర్వాత.. అదనపు కలెక్టర్ స్థాయిలో నగేష్ తన అధికారాన్ని ఉపయోగించి పునఃసమీక్ష జరిపినట్లు ఏసీబీ అధికారుల దృష్టికొచ్చింది. ఇసుక రీచ్ల యజమానులకు ఇబ్బందులు కలిగించడం వల్ల వారి నుంచి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ అంశానికి సంబంధించిన ఫైళ్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ విచారణకు పెద్దగా సహకరించని నగేష్ కేసులో బయటి సాక్ష్యాల ఆధారంగా అతనిపై మోపిన అభియోగాల్ని కోర్టులో నిరూపించేందుకు అధికారులు ఆధారాల్ని సేకరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ నుంచి నగేష్ లబ్ధి పొందారంటూ పలువురు బాధితులు ఇప్పటికే ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. వారు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాల్ని అధికారులు సేకరిస్తున్నారు.
Updated Date - 2020-10-01T08:03:07+05:30 IST