వడగాడ్పులతో జరభద్రం!
ABN, First Publish Date - 2020-04-26T09:03:57+05:30
కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో వేసవి తీవ్రతతో వీచే వడగాడ్పులతో ..
కరోనా నేపథ్యంలో అప్రమత్తత
రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో వేసవి తీవ్రతతో వీచే వడగాడ్పులతో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం... రాష్ట్రాలకు సూచించింది. వడగాడ్పుల తీవ్రతతో మరింతమంది మృత్యువాతపడే అవకాశాలున్నాయని కేంద్రం హెచ్చరించింది. కరోనా రోగులతో ఇప్పటికే నిండి ఉన్న ఆస్పత్రుల్లో వడగాడ్పులతో ఆనారోగ్యం పాలైనవారు చేరితే మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, వడగాడ్పుల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రధానంగా వృద్ధులు, చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఉపాధి హామీ, వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. తెలంగాణలో రానున్న రెండురోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీ్సగఢ్ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దాంతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగళ్ళు, ఈదురుగాలులతో తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణస్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని గుర్తు పేర్కొంది.
Updated Date - 2020-04-26T09:03:57+05:30 IST