హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్
ABN, First Publish Date - 2020-09-27T20:31:54+05:30
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హేమంత్ కులోన్మాద హత్యకేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హేమంత్ కులోన్మాద హత్యకేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. అవంతి మేనమామ యుగేంధర్రెడ్డే ఆమె భర్త హేమంత్ కిడ్నాప్, హత్యకు సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ హత్యకేసులో పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18 మంది నిందితుల్లో మరో ఇద్దరు నిందితులు జగన్, సయ్యద్ పరారీలో ఉన్నారు. అయితే తాజాగా మరో ట్విస్ట్ను అవంతి బయపెట్టారు.
హేమంత్ కేసులో మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అవంతి ఆరోపిస్తున్నారు. సందీప్రెడ్డి గూడూరు, ఆశిష్రెడ్డి ప్రమేయం ఉందని పేర్లతో సహా అవంతి చెబుతున్నారు. గతంలో హేమంత్ తండ్రిని సందీప్రెడ్డి బెదిరించారని చెప్పారు. హేమంత్ కిడ్నాప్ అయిన రోజే సందీప్ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని అవంతి మీడియాకు ముఖంగా వెల్లడించారు.
కాగా ఇవాళ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆమె.. ‘‘మా అమ్మానాన్నలను స్పాట్లోనే ఎన్కౌంటర్ చెయ్యండి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి.. ‘‘కేసీఆర్ సార్, జగన్ సార్ నాకు న్యాయం చేయండి. కేటీఆర్ సార్ నాకు న్యాయం చేయండి. మీరంతా నాతో ఉండాలని కోరుతున్నాను’’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2020-09-27T20:31:54+05:30 IST