ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది
ABN, First Publish Date - 2020-12-15T05:55:52+05:30
తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర సాధనకు ముందు ఎన్నో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకుండా, వారిని మోసం చేసిందని బీజేపీ నాయకులు ఆరోపించారు.
బీజేపీ నాయకులు
ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా
పోలీసులతో వాగ్వాదం
ఆదిలాబాద్ టౌన్, డిసెంబరు 14: తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర సాధనకు ముందు ఎన్నో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకుండా, వారిని మోసం చేసిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పట్ల అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టిన నాయకులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన ద్వారంలోకి చొచ్చుకెళ్లిన నాయకులు గేటు వద్ద భైఠాయించి కలెక్టర్ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్రావు సిబ్బందితో కలిసి బీజేపీ నాయకులను వారించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసు లు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. వెంటనే డీఎస్పీ వెంకటేశ్వర్రావు ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేసిన వినలేదు. పోలీసులు, నాయకుల మధ్య తోపులాటతో కలెక్టర్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న గేటు విరిగి పోయింది. అయినా వినకుండా ఆందోళన చేస్తున్న నాయకులకు డీఎస్పీ సముదాయించడంతో ఆందోళన విరమించారు. అంతకుముందు ధర్నాలో రాష్ట్ర నాయకు లు సుహాసినిరెడ్డి, జిల్లా నాయకులు వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించారన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏ ఒక్కసమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నిజాం పాలనను తలపించేలా పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల ని, లేనిపక్షంలో వారికి మద్దతుగా బీజేపీ ఆందోళనలు చేస్తుందని హెచ్చరించా రు. ఇందులో నాయకులు ఆదినాథ్, శరత్, వేణుగోపాల్, బ్రహ్మానందం, ఆకుల ప్రవీన్, లోక ప్రవీన్రెడ్డి, ఎన్రాలనగేష్, తదితరులున్నారు.
‘సమస్యలను వెంటనే పరిష్కరించాలి’
నిర్మల్ టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నాయకులు అప్పాల గణేష్ చక్రవర్తి డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు సోమవారం నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మంది బలి దానాలతో తెచ్చుకున్న తెలంగాణ కుటుంబ పాలనగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులకు ఇప్పటి వరకు పీఆర్సీ, మధ్యంతర భృతి అందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర భృతి 27శాతం చెల్లిస్తూ ఉంటే తెలంగాణ ఉద్యోగులకు ఈ దుస్థితేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ది చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి, కృష్ణ జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్, కార్యవర్గ సభ్యులు ఓడిసెల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కమల్నయన్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-15T05:55:52+05:30 IST