కాంగ్రెస్లో కలవరం
ABN, First Publish Date - 2020-12-12T05:00:57+05:30
క్రమంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా కలవరానికి గురి చేస్తున్నాయి.
నేతల పార్టీ ఫిరాయింపులపై జోరుగా ఊహాగానాలు
పార్టీ ఫిరాయింపుల ప్రచారంపై ఖండనలు కరువు
సీనియర్ నేతలు, కేడర్లో అయోమయం
క్రమంగా కరువవుతున్న దిశానిర్దేశం
పెద్ద ఎత్తున ఫిరాయింపులకు అవకాశం
జిల్లాలో హస్తం పార్టీ ఆగమాగం
నిర్మల్ , డిసెంబరు 11 ( ఆంధ్రజ్యోతి ) : క్రమంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా కలవరానికి గురి చేస్తున్నాయి. రాజకీయ కేంద్రమైన నిర్మల్లో కాంగ్రెస్పార్టీ కొంతకాలం క్రితం వరకు పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని చెలాయించింది. టీఆర్ఎస్ దూకుడు పెరిగినా, బీజేపీ హవా విస్తరించినా కాంగ్రెస్ మాత్రం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ తన రాజకీయ ప్రస్థా నాన్ని కొనసాగిస్తోంది. అనేక సంక్షోభాల నుంచి గట్టెక్కుతూ ఉన్న కేడర్ను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో ఆ పార్టీ ఇలా ఏటికి ఎదురీదుతూ పలు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలనే కాకుండా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ పదవులను సైతం దక్కించుకుంది. ఇప్పటికి జిల్లాలో ఆ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటైన ప్రత్యర్థిగానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికల, జీహెచ్యంసీ ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టేసి ఆ స్థానంలో బీజేపీని తీసుకువచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి జిల్లాలో సైతం రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా నిర్మల్ నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కొంతమంది కౌన్సిలర్లు, సీనియర్ నేతలతో కలిసి బీజేపీలో చేరిపోయారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఏలేటీ మహే శ్వర్రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారన్న ఊహానాగాలు ఊపందుకున్నాయి. అయితే ఆయన జిల్లాలోని మరికొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు చెబుతున్నారు. మహేశ్వర్రెడ్డికి కన్నా ముందుగానే అప్పాల గణేష్ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత అయోమయం ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే మహేశ్వర్రెడ్డి జనవరి 26వ తేదీన బీజేపీలో చేరబోతున్నారంటూ ఆయన వర్గీయులు బహిరంగంగా చేస్తు న్న ప్రచారం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. మహేశ్వర్రెడ్డితో పాటు ఇక్కడి అన్ని మండలాలకు చెందిన చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయన మద్దతు దారులు బీజేపీలో చేరే అవకాశాలున్నాయంటున్నారు. ఇదిలా ఉండగా ముథోల్ నియోజకవర్గం నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్లు కూడా తమ అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందన్న ప్రచారం మొదలైంది. కాగా ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీలో చేరికల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ఎంపీ సోయం బాపురావు ఈ కాంగ్రెస్ నేతల చేరికల విషయంలో ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారుతోంది. బాపురావు వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ సీనియర్ నేతలకు చెక్పెట్టే ఉద్దేశంతో నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ను పార్టీలోకి రప్పించినట్లు చెబుతున్నారు. దీంతో పాటు ఖానాపూర్ మాజీ ఎంపీపీ ఆకుల శ్రీనివాస్ దంపతులను కూడా పార్టీలో చేర్పించేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. అటు రమేష్ రాథోడ్కు, ఇటు మహేశ్వర్రెడ్డిలకు సన్నిహితంగా ఉన్న అప్పాల గణేష్ చక్రవర్తి, ఆకుల శ్రీనివాస్లను ముందుగానే పార్టీలోకి తీసుకువచ్చే ప్రక్రియను ఎంపీ సోయంబాపురావు పర్యవేక్షించినట్లు చెబుతున్నారు. అయితే ఆకుల శ్రీనివాస్ కొద్ది రోజుల్లోనే బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిణామాలన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని కుంగదీస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులు, సీనియర్ నాయకులు ప్రస్తుత పరిణామాల పట్ల గందరగోళానికి లోనవుతున్నారు. ఒకవేళ ఈ నేతలంతా బీజేపీలో చేరితే జిల్లా కాంగ్రెస్ పార్టీకి భారీనష్టం జరగడమే కాకుండా ఉన్న ఆ కొద్ది కేడర్కు దిశానిర్దేశం కూడా కరువయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
కాంగ్రెస్లో కరువైన సమన్వయం
అయితే జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ వైపు చూస్తుండడం, దీనికి అనుగుణంగానే బీజేపీ సైతం ఆపరేషన్ ఆకర్ష్ను పకడ్బంధీగా అమలు చేస్తున్నప్పటికీ దీనిని అడ్డుకునే చర్యలు మాత్రం కరువయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నియోజకవర్గ స్థాయి నాయకులు, కేడర్ మధ్య సమన్వయం కుదుర్చలేకపోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలను పలకరించే వారే కరువయ్యారంటున్నారు. స్థానికంగా ఉన్న నియోజకవర్గ స్థాయి నేత మాత్రమే కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నప్పటికీ కాషాయప్రభావం విషయంలో ఎలాంటి సమన్వయం కనబడడం లేదంటున్నారు. పార్టీ నాయకత్వం ఫిరాయింపుల విషయంలో పెద్దగా పట్టించుకోకపోతుండడం కూడా బీజేపీకి కలిసొస్తోంది. కాంగ్రెస్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఎలాంటి ఆదరణకు నోచుకోని వారంతా ప్రస్తుతం కాషాయదళం వైపు చూస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని బీజేపీ కూడా సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్కు దీటైనా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సిద్ధమవుతోందంటున్నారు.
ముగ్గురు నేతల చుట్టూ బీజేపీ గురి
కాగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోందం టున్నారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్లను ఒకేసారి బీజేపీ లోకి రప్పించేందుకు ఆ పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు చెబుతున్నారు. వీరందరిని పార్టీలోకి ఆహ్వానించి జాతీయస్థాయి నేతలతో వీరికి కాషాయకండువాను కప్పించాలని ఆ పార్టీ వ్యూహంగా పెట్టుకుందంటున్నారు. ఈ మూడు నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ అగ్రనేతలు ఒకేసారి బీజేపీలో చేరినట్లయి తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుందని ఆ తరువాత అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ సమీప ప్రత్యర్థిగానే కాకుండా ప్రధాన ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంటుందని కాషాయ నేతలు యోచిస్తున్నారంటున్నారు.
కాగా జిల్లాలోని మూడు సెగ్మెంట్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నాయకులు బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ నాయకత్వం మొదట కాంగ్రెస్ నేతలకు గాలం వేస్తూనే పనిలో పనిగా టీఆర్ఎస్లోని అసంతృప్తి నేతలు, కార్యకర్తలను దువ్వేందుకు కూడా ప్రయత్నాలు చేయడం లేదు. మరో నెల రోజుల పాటు పార్టీ వైపు ఆకర్షితులయ్యే వారందరి నివేదికలను స్థానిక నేతలు రూపొందించి ఆ నివేదికలను రాష్ట్ర నాయకత్వానికి పంపనున్నట్లు సమాచారం. ఈ నివేదికలపై సుదీర్ఘంగా కసరత్తు జరిపి అందరిలో సమన్వయం కుదుర్చుకుంటూ చేరికల వ్యవహారాన్ని చేపట్టేందుకు అధిష్టానం నిర్ణయించిందంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ దూకుడు, బీజేపీ సెంటిమెంట్ పవనాల కారణంగా తీవ్ర గందరగోళానికి గురవుతున్న కాంగ్రెస్ కేడర్నే లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.
Updated Date - 2020-12-12T05:00:57+05:30 IST