నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
ABN, First Publish Date - 2020-03-14T11:30:25+05:30
ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని
కలెక్టర్ అజీమ్
మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష
భూపాలపల్లి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ అధికారులను ఆదేశించారు. భూపాలపల్లిలోని కలెక్టరేట్లో శుక్రవారం మిషన్ భగీరథ అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ నెల చివరి లోగా పెండింగ్లో ఉన్న మిషన్ భగీరథ పనులన్నింటిని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా ఇప్పటికే ఉపయోగిస్తున్న వసతులను వాడుకోవాలన్నారు. గ్రామాల్లో, భూపాలపల్లి పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే పరిస్థితి రాకుండా ముందస్తుగానే ఏర్పాట్లు చేయాలన్నారు. నీటి సరఫరాకు సంబంధించి పైప్లైన్ల రిపేరు ఉంటే ముందుగానే చెక్ చేసుకోవాలన్నారు. తాగునీటి సరఫరాకు ఎక్కడా విద్యుత్ అంతరాయం కలగకుంగా విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-14T11:30:25+05:30 IST