మన నీళ్లు, వనరులు మనకే!
ABN, First Publish Date - 2020-06-21T09:30:59+05:30
‘‘మా వనరులు మాకు ఉన్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి.
- సాకారమవుతున్న జయశంకర్ సార్ కలలు
- నేడు ఆయన తొమ్మిదో వర్ధంతి
హన్మకొండ, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ‘‘మా వనరులు మాకు ఉన్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి. మా తెలంగాణ మాగ్గావాలి’’ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష గురించి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఎప్పుడు గళమెత్తినా మొదట ఆయన నోట నుంచి వచ్చే మాటలు ఇవి. తెలంగాణ రాష్ట్రం ఎందుకు? అని ప్రశ్నించినవారికి ఆయన సూటిగా ఇచ్చిన జవాబు ఇదే. ఏ వేదిక మీద ఆయన మాట్లాడినా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గణాంకాలతో సహా వివరించేవారు. మా నీళ్లు, మా ఉద్యోగాలు వేరెవరో దోచుకుంటే ఎట్లా ఊరుకుంటామని ప్రశ్నించేవారు. తెలంగాణ ఆవిర్భావాన్ని కళ్లారా చూడకముందే ఆయన దివంగతులయ్యారు.
ఆదివారం ఆయన తొమ్మిదో వర్ధంతి. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవిస్తే గొప్పగా ఎదుగుతుందని అని ఆకాంక్షించిన జయంశంకర్ సార్ కన్న కలలు సాకారం అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి పరుగుకు అడ్డేసి.. ఆ నీళ్లను బీళ్లకు మరలిస్తున్న వైనం ప్రపంచంలోనే అద్భుతం. గత సంవత్సరం ఆయన వర్ధంతి రోజుననే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆయకట్టు 45 లక్షల ఎకరాలు సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తపోయడమే దీని లక్ష్యం. నీళ్లు.. నిధులు.. నియామకాలు అని జయశంకర్ సార్ ఇచ్చిన నినాదంలో మొదటిదైన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ ఉద్యమ దీప్తి స్మృత్యర్ధం భూపాపల్లికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేశారు. హన్మకొండలోని బాలసముద్రలో ఆయన స్మారకార్ధం జయశంకర్ స్మృతివానాన్ని ఏర్పాటు చేశారు. ప్రగతి పథకంలో పయనించేందుకు నడకవేగాన్ని పెంచుకుంటోంది. తెలంగాణ అభివృద్ధితోనే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి.
Updated Date - 2020-06-21T09:30:59+05:30 IST