దొరికిపోయిన ఎంఐ.. ఆడుకుంటున్న నెటిజన్లు
ABN, First Publish Date - 2020-12-28T21:53:37+05:30
యాపిల్ సంస్థ కొన్ని వారాల క్రితం విడుదల చేసిన ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లకు చార్జర్ను ఇవ్వకపోవడం అప్పట్లో హాట్ టాపిక్గా...
యాపిల్ సంస్థ కొన్ని వారాల క్రితం విడుదల చేసిన ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లకు చార్జర్ను ఇవ్వకపోవడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. వేలు, లక్షలు పెట్టి ఫోన్ కొన్నా ఛార్జర్ను మళ్లీ విడిగా కొనుక్కోవడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అంతేకాదు, ఆ సందర్భంలో స్మార్ట్ఫోన్ మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలు యాపిల్ కంపెనీపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించాయి. అయితే.. అప్పట్లో యాపిల్ను పరోక్షంగా విమర్శించిన షియోమీ కూడా ఇప్పుడు అదే బాటలో వెళుతుండటం కొసమెరుపు.
షియోమీ నుంచి కొత్తగా ఎంఐ 11 ఫోన్లు విడుదల కాగా.. ఫోన్ బాక్స్లో ఛార్జర్ కనిపించకపోవడం గమనార్హం. తీరా ఆరా తీయగా.. ఎంఐ 11 ఫోన్లు ఛార్జర్తో కలిపి రావని ఆ సంస్థ సీఈవో స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు షియోమీపై జోకులు, ట్రోల్స్తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. యాపిల్కు నీతులు చెప్పి షియోమీ చేసిందేంటని ప్రశ్నిస్తున్నారు.
Updated Date - 2020-12-28T21:53:37+05:30 IST