మూడేళ్లు ఇంటిమొహం చూడను!
ABN, First Publish Date - 2020-04-12T10:12:43+05:30
కరోనాపై పోరులో భాగంగా లాక్డౌన్ విధించడంతో క్రీడాకారులంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. కొందరేమో ఇంట్లో పనులు చేస్తూ భార్యలకు ...
న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా లాక్డౌన్ విధించడంతో క్రీడాకారులంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. కొందరేమో ఇంట్లో పనులు చేస్తూ భార్యలకు సహకరిస్తుండగా.. మరికొందరు ఇండోర్ గేమ్స్ ఆడుతూ తమ సరదా తీర్చుకుంటున్నారు. అయితే, తనకు మాత్రం ఇంట్లో ఉండడం మహా బోర్గా ఉందంటున్నాడు టీమిండియా యువ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్. ప్రస్తుతం తాను కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నానన్న చాహల్.. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మూడేళ్లపాటు ఇంటి మొహమే చూడొద్దనుకుంటున్నానని అన్నాడు. ‘లాక్డౌన్ ఎత్తేస్తే ముందు ఇంటి నుంచి బయటపడతా. మూడేళ్ల దాకా ఇంటి మొహమే చూడకూడదనిపిస్తోంది. హోటల్లోనైనా ఉంటా కానీ.. ఇంటికి రాకూడదనుకుంటున్నా. వామ్మో.. ఇంతటి సుదీర్ఘమైన లాక్డౌన్ను ఎన్నడూ చూడలేదు. నాకు నిద్ర పట్టడం లేదు. ఎప్పుడెప్పుడు మైదానానికి వెళ్దామా, బంతులేద్దామా అనిపిస్తోంది. లాక్డౌన్ ముగిసిన వెంటనే ప్రతిరోజూ గ్రౌండ్కెళ్లి ఒక్క బంతైనా వేయాలనుంది’ అని ఓ టెలివిజన్ చాట్షోలో చాహల్ చెప్పుకొచ్చాడు.
Updated Date - 2020-04-12T10:12:43+05:30 IST