2022 వరకు ఆమే!
ABN, First Publish Date - 2020-04-05T09:57:18+05:30
స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా ఊహించి ఉండదు. కానీ మూడేళ్లపాటు ఆమే ప్రపంచ చాంపియన్. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రపంచ బ్యాడ్మింటన్ ...
సింధుకు మూడేళ్లు
ప్రపంచ చాంపియన్ హోదా
హైదరాబాద్: స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా ఊహించి ఉండదు. కానీ మూడేళ్లపాటు ఆమే ప్రపంచ చాంపియన్. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (డబ్ల్యూబీఎఫ్) 2006 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ చాంపియన్షి్ప నిర్వహిస్తోంది. సింధు 2019లో ప్రపంచ చాంపియన్షి్ప గెలిచింది. ఆ ప్రకారం 2020 వరకే ఆమెకు ఆ హోదా. కానీ ఒలింపిక్స్ ఏడాదిలో వరల్డ్ చాంపియన్షి్ప నిర్వహించరు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ జూలైలో ఒలింపిక్స్ జరగాలి. కానీ కరోనా వైర్సతో విశ్వ క్రీడలు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి. దాంతో వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్షిప్ను నిర్వహించే అవకాశాలు లేవు. ఇక 2021 డబ్ల్యూబీఎఫ్ క్యాలెండర్ పరిశీలిస్తే.. నవంబరు వరకూ ఖాళీ లేదు. దాంతో ఈ మూడేళ్ల పాటు సింధుదే వరల్డ్ టైటిల్ అని బ్యాడ్మింటన్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా..తాను ప్రపంచ చాంపియన్గా ఏకంగా మూడేళ్లు కొనసాగనుండడంపై సింధు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ‘టోర్నీలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపైనే ప్రస్తుతం మా దృష్టి నిలిచింది. వరల్డ్ చాంపియన్షి్ప, ఒలింపిక్స్ వాయిదా పడడంపై చర్చ జరుగుతోంది’ అని ఆమె చెప్పింది. ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో పాల్గొని గతనెల 14న స్వదేశానికి వచ్చిన సింధు 14 రోజుల స్వీయ నిర్బంధంలో ఉంది. వాస్తవంగా ఆ నిర్బంధం కిందటినెల 28న ముగిసింది. కానీ విదేశాల నుంచి వచ్చిన దరిమిలా దానిని ఈనెల 5వరకు పొడిగించారు. ‘స్థానిక పోలీసులు మమ్మల్ని పర్యవేక్షిస్తున్నారు. క్వారంటైన్ను ఈనెల 5వరకు పొడిగించారు. మా పాస్పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటికి స్టిక్కర్ అతికించారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన స్నేహితులను విచారిస్తే.. వారికి కూడా ఇలానే చేశారని చెప్పారు’ అని సింధు వివరించింది.
Updated Date - 2020-04-05T09:57:18+05:30 IST