శిక్షణకు డబ్బుల్లేవ్..కారు అమ్ముతున్నా: ద్యూతీ
ABN, First Publish Date - 2020-07-12T09:09:44+05:30
స్టార్ అథ్లెట్ ద్యూతీ చంద్ ఒలింపిక్స్ సన్నాహకాలకు డబ్బుల్లేక తన బీఎండబ్ల్యూ కారును అమ్మకానికి పెట్టింది. కారు కొనుగోలు చేసేందుకు ...
భువనేశ్వర్: స్టార్ అథ్లెట్ ద్యూతీ చంద్ ఒలింపిక్స్ సన్నాహకాలకు డబ్బుల్లేక తన బీఎండబ్ల్యూ కారును అమ్మకానికి పెట్టింది. కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి గల వారు తనను సంప్రదించాలని కోరుతూ.. కారు ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ‘ఒలింపిక్స్కు సన్నద్ధమయ్యేందుకు ఇప్పటిదాకా ఉన్న డబ్బంతా ఖర్చు చేశా. ఇక నా వద్ద ఏమీ లేదు. నా కోచ్, ఫిజియోథెరపిస్టులు, డైటీషియన్కు జీతాలు ఇవ్వడానికి నెలకు రూ.5 లక్షలు వ్యయమవుతుంది. కరోనా మహమ్మారి కారణంగా స్పాన్సర్లు చేతులెత్తేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే కష్టకాలంలో ఉన్నట్లు అధికారుల నుంచి జవాబు వచ్చింది. చేసేది లేక బీఎండబ్ల్యూను అమ్మకానికి పెట్టా. ఆ కారు మెయింటెనెన్స్ కూడా నాకు భారంగా మారింది’ అని ద్యూతీ ఆవేదన వ్యక్తం చేసింది. 2015 ఆసియా క్రీడల్లో పతకం నెగ్గినప్పుడు ఒడిశా ప్రభుత్వం ద్యూతీకి రూ. 3 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. అందులో కొంతమొత్తంతో ఈ కారు కొనుగోలు చేసింది. ఇక, ద్యూతీ పోస్ట్ వైరలవడంతో ఒడిశా ప్రభుత్వం సాయం చేయడానికి ముందుకొచ్చింది. దీంతో ద్యూతీ ఫేస్బుక్లో పోస్ట్ను తొలగించింది.
Updated Date - 2020-07-12T09:09:44+05:30 IST