కరోనా తర్వాత క్రికెట్లో అవి లేకపోవడం విచిత్రంగా ఉంటుంది: కోహ్లీ
ABN, First Publish Date - 2020-06-01T01:50:02+05:30
కరోనా కారణంగా ప్రస్తుతం క్రికెట్ అనే మాట కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఒకవేళ కరోనా తగ్గుముఖం పట్టినా...
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ప్రస్తుతం క్రికెట్ అనే మాట కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఒకవేళ కరోనా తగ్గుముఖం పట్టినా మళ్లీ మునుపటిలా క్రికెట్ కొనసాగుతుందన్న నమ్మకం లేదు. క్రికెట్ ప్రారంభం అయిన తర్వాత కూడా ఆటగాళ్లు ఒకరినొకరు తాకేందుకు ఎట్టిపరిస్థితుల్లో వీల్లేదని ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కరోనా తరువాత క్రికెట్ సాధారణ స్థితిలో ఉండకపోవడం విచారకరమని పేర్కొన్నాడు. ‘కరోనా తర్వాత క్రికెట్ మొదలైనప్పటికీ షేక్హ్యాండ్, హైఫైవ్లు ఉండకపోతే విచిత్రంగా ఉంటుంది.
సాధారణంగా క్రికెట్ ప్రాక్టీస్ చేసే సమయంలో కూడా చప్పట్లు కొట్టడం, హైఫైవ్లు అలవాటై పోయి ఉంటాయి. అయితే ఇక ముందు అవి పొరపాటున కూడా క్రికెట్లో ఉండకపోవచ్చు’ అని కోహ్లీ అన్నాడు. అంతేకాకుండా చాలా కాలం తరువాత ఎదుటివారిని కలుస్తామని, అయితే చేతులు కట్టుకుని, దూరంగా ఉండి వారిని పలకరించాల్సి ఉంటుందని కోహ్లీ చెప్పాడు.
Updated Date - 2020-06-01T01:50:02+05:30 IST