మెరిసిన రాయుడు, జడేజా.. ఢిల్లీ టార్గెట్ 180
ABN, First Publish Date - 2020-10-18T03:01:47+05:30
ఐపీఎల్లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో చెన్నై జట్టు నాలుగు వికెట్ల నష్టానికి...
షార్జా: ఐపీఎల్లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో చెన్నై జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టు ముందు 180 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టుకు ఢిల్లీ బౌలర్ తుషార్ దేశ్పాండే ఆదిలోనే షాకిచ్చాడు. తుషార్ బౌలింగ్లో షాట్కు యత్నించిన శామ్ కరన్ నోర్జెకు క్యాచ్గా చిక్కి డకౌట్గా వెనుదిరిగాడు. అయితే.. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన షేన్ వాట్సన్, డుప్లెసిస్ కొంత నిలకడగా ఆడి జట్టుకు స్కోర్ అందించే ప్రయత్నం చేశారు. అయితే.. నోర్జె బౌలింగ్లో 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వాట్సన్ బౌల్డ్ అయ్యాడు.
కెప్టెన్ ఎంఎస్ ధోనీ 3 పరుగులకే నోర్జె బౌలింగ్లో అలెక్స్ క్యారీకి కీపర్ క్యాచ్గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. డుప్లెసిస్ 47 బంతుల్లో 58 పరుగులతో రాణించాడు. రబడ బౌలింగ్లో ధావన్కు క్యాచ్గా చిక్కి డుప్లెసిస్ వెనుదిరిగాడు. అయితే.. అంబటి రాయుడు, జడేజా రాణించడంతో చెన్నై జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. అంబటి రాయుడు 25 బంతుల్లో నాలుగు సిక్స్లు, ఒక ఫోర్తో 45 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రవీంద్ర జడేజా 13 బంతుల్లోనే నాలుగు సిక్స్లు కొట్టి 33 పరుగులు చేసి మరోసారి ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్జెకు రెండు వికెట్లు దక్కగా, తుషార్ దేశ్పాండే, రబడకు తలో వికెట్ దక్కింది.
Updated Date - 2020-10-18T03:01:47+05:30 IST