కరోనా ఎఫెక్ట్: పడకే శవపేటిక
ABN, First Publish Date - 2020-05-23T22:11:12+05:30
కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ తరుణంలో ఒకరిని మరొకరు తాకాలంటేనే భయపడుతున్నారు. కనీసం దగ్గరగా ఉండడానికి...
బొగోటా: కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ తరుణంలో ఒకరిని మరొకరు తాకాలంటేనే భయపడుతున్నారు. కనీసం దగ్గరగా ఉండడానికి బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో వారి మృతదేహాలను తరలించేందుకు ప్రత్యేక పద్ధతులను అవలంబించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొలంబియా ఓ వినూత్న విధానంపై ప్రయోగాలు చేస్తోంది. పడకనే శవపేటికగా మార్చే విధానాన్ని పరిశీలిస్తోంది. కరోనా కారణంగా మరణించిన బాధితులను వారికి చికిత్స అందించిన పడకలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించేలా పడకలను తయారు చేస్తోంది. స్థానిక వ్యాపారవేత్త రుడాల్ఫో గోమెజ్ ఈ పడకలను తయారుచేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పక్కదేశం ఈక్వెడార్లో కరోనా బాధితుల మృతదేహాలకు అంత్యక్రియలు జరగక రోడ్లపై పడి ఉంటున్నాయన్నారు.
అది చూసిన తాను చాలా బాధపడ్డానని, అందుకే శవ పేటికలుగా మారే పడకలను రూపొందిస్తున్నానని చెప్పారు. ఈ పడకల ఖరీదు దాదాపు 92 డాలర్లు(రూ.7వేలు) నుంచి 132 డాలర్లు(రూ.10వేలు) వరకు ఉంటుందని చెప్పారు. దీనికి ఇనుపకడ్డీలతో రెయిలింగ్ ఉంటుందని, చక్రాలు, బ్రేకులు కూడా ఉంటాయని, పైకి, కిందకు జరుపుకునేందుకు వీలుంటుందని వివరించారు.
Updated Date - 2020-05-23T22:11:12+05:30 IST