1992 కరసేవలో దివ్యాంగుడయ్యాడు... ఇప్పుడు భూమిపూజ చూసేందుకు తహతహ!
ABN, First Publish Date - 2020-08-04T15:41:54+05:30
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రేపు భూమి పూజ జరగనుండగా, మరోవైపు 1992 నాటి కరసేవలో పాల్గొన్న వారి గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో నాటి కరసేవలో పాల్గొని, దివ్యాంగునిగా...
భోపాల్: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రేపు భూమి పూజ జరగనుండగా, మరోవైపు 1992 నాటి కరసేవలో పాల్గొన్న వారి గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో నాటి కరసేవలో పాల్గొని, దివ్యాంగునిగా మారిన అచల్ సింగ్ మీణా ఇప్పుడు ఆయోధ్యలో జరిగే భూమి పూజకు వెళ్లాలని కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 20 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామానికి చెందిన అచల్ సింగ్ మీణా అయోధ్యలో 1992 లో జరిగిన కరసేవలో పాల్గొని, తీవ్రంగా గాయపడ్డారు. అతని రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. అప్పటినుంచి ఇతరుల సహాయంతో బతుకుతున్నారు. 28 సంవత్సరాలుగా అతనికి బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా పోయింది. 1992లో అచల్కు 30 ఏళ్లు. అదే ఏడాది డిసెంబర్ 6 న బాబ్రీ కూల్చివేత సమయంలో గోపురానికి సంబంధించిన కొన్ని శిధిలాలు అచల్పై పడ్డాయి. దీంతో ఆయన దివ్యాంగునిగా మారిపోయారు. ప్రస్తుతం అచల్ వయసు 58 సంవత్సరాలు. 1992 నుంచి అచల్ను పలువురు నేతలు పరామర్శించినప్పటికీ, ఎవరూ ఎటువంటి సాయం అందించలేదని అతను చెబుతుంటారు. ఇప్పుడు అయోధ్య భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నప్పటికీ, ఇతరుల సాయం లేకుండా వెళ్లలేనని, అందుకే ప్రత్యక్ష ప్రసారంలో ఆ కార్యక్రమాన్ని చూస్తానని అచల్ తెలిపారు.
Updated Date - 2020-08-04T15:41:54+05:30 IST