పెళ్లి వేడుక తెచ్చిన తంటా.. 176 మందికి కరోనా.. ఏడుగురు మృతి
ABN, First Publish Date - 2020-09-17T18:04:15+05:30
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.
మైనే(యూఎస్): అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యాధిక పాజిటివ్ కేసులు, మరణాలతో యూఎస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదిలాఉంటే... యూఎస్లోని మైనే రాష్ట్రంలో జరిగిన ఓ పెళ్లి వేడుక ఏకంగా 176 మందికి ఈ వైరస్ వ్యాప్తికి కారణమైంది. అలాగే ఏడుగురు బాధితులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే... ఆగస్టు 7న సెంట్రల్ మైనేలోని మిల్లినోకెట్లో ఓ పెళ్లి వేడుక జరిగింది. దీనికి 65 మంది అతిథులు హాజరయ్యారు. ఇండోర్ వేడుకులకు 50 మందికి మించి అతిథులు హాజరు కావద్దన్న నిబంధనను పెళ్లి వారు ఈ సందర్భంగా అతిక్రమించడం జరిగింది.
ఇక ఈ వేడుక ద్వారా ఏకంగా 100 మైల్స్(సుమారు 160 కిలోమీటర్లు) దూరంలో గల మాడిసన్ వరకు ఈ మహమ్మారి వ్యాప్తి చెందడం గమనార్హం. ఇలా పెళ్లికి వచ్చిన వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందడంతో మొత్తం 176 మంది కొవిడ్ బారిన పడ్డారు. దీంతో ఈ వేడుక కరోనా సూపర్ స్ప్రెడర్గా మారింది. ఇక కరోనాతో చనిపోయిన ఏడుగురు అసలు ఈ పెళ్లికి కూడా హాజరు కాలేదని మైనే వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాల డైరెక్టర్ నీరవ్ షా తెలిపారు. కేవలం సెకండరీ స్ప్రెడ్ కారణంగా వీరు మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2020-09-17T18:04:15+05:30 IST