కరోనా ఎఫెక్ట్: అజ్మాన్లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు కూడా ప్రజలకు సందేశమిస్తున్నాయి !
ABN, First Publish Date - 2020-04-02T14:41:16+05:30
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని భయం గుప్పిట్లో నెట్టేసింది. చైనాలో పురుడుపోసుకున్న కొవిడ్-19 ఆ తర్వాత సుమారు 200 దేశాలకు పాకింది.
అజ్మాన్: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని భయం గుప్పిట్లో నెట్టేసింది. చైనాలో పురుడుపోసుకున్న కొవిడ్-19 ఆ తర్వాత సుమారు 200 దేశాలకు పాకింది. అగ్రరాజ్యాలను సైతం వదిలిపెట్టలేదు. గల్ఫ్ దేశాల్లో కూడా తన ఉనికి చాటుకుంది. సౌదీ అరేబియా, ఖతార్ దేశాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. రోజురోజుకీ విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు గల్ఫ్ దేశాలు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాయి. ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేశాయి. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశాయి. యూఏఈ ఏకంగా 21 రోజుల పాటు కర్ఫ్యూ కూడా విధించింది. బహిరంగ ప్రదేశాల్లో జనసమూహాలను నిషేధించాయి.
తాజాగా అజ్మాన్ స్వీయ నిర్బంధంపై ప్రజలను అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను కూడా వినియోగించడం విశేషం. అక్కడి ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు మూములుగా వచ్చే మొత్తం ఒకే కలర్ లైట్కు బదులు అందులో 'స్టే హోం' అనే మెసేజ్ వచ్చేలా అధికారులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు వాహనదారులకు లైట్స్(గ్రీన్, రెడ్, పసుపు)లో 'స్టే హోం' అనే సందేశం కనిపిస్తుంది. దీనిపై అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో ఇంట్లో ఉండడం ఎంత ముఖ్యమో ప్రభుత్వం ప్రజలకు ఇలా తెలియజేయడం అభినందనీయమని వారు కొనియాడుతున్నారు. దీంతో అజ్మాన్ ట్రాఫిక్ లైట్లకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Updated Date - 2020-04-02T14:41:16+05:30 IST