సౌదీలో కరోనా స్వైర విహారం..!
ABN, First Publish Date - 2020-05-28T16:56:16+05:30
గల్ఫ్లో మహమ్మారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సౌదీ అరేబియాలో శరవేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19 వల్ల ప్రతి రోజు భారీగా పాటిజివ్ కేసులు నమోదవుతున్నాయి.
రియాధ్: గల్ఫ్లో మహమ్మారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సౌదీ అరేబియాలో శరవేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19 వల్ల ప్రతి రోజు భారీగా పాటిజివ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కూడా 1,815 కొత్త కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకూ సౌదీలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 78,541కి చేరింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో అధికంగా రియాధ్ (739), జెడ్డా (325), మక్కా (162), హుఫోఫ్ (118) తదితర ప్రాంతాల్లో నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
అలాగే 2,572 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 50వేలు దాటింది. ఇక నిన్న సంభవించిన 14 మరణాలతో కలిపి ఆ దేశంలో ఈ మహమ్మారికి బలైనవారు 425 మంది అయ్యారు. మరోవైపు సౌదీ సర్కార్ గురువారం నుంచి కర్ఫ్యూలో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలాఉంటే... ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న ఈ వైరస్ ఇప్పటికే 3.57 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. 57 లక్షలకు పైగా మందికి సోకింది.
Updated Date - 2020-05-28T16:56:16+05:30 IST