ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన రష్యా.. కరోనాకు తొలి వ్యాక్సిన్ రెడీ?
ABN, First Publish Date - 2020-07-13T13:53:32+05:30
ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆక్స్ఫర్డ్ టీకా వైపు.. అమెరికా చెందిన మోడెర్నా కంపెనీ టీకావైపు.. మన భారతీయులు కోవాగ్జిన్ కోసం ఆశగా ఎదురుచూస్తుంటే
- అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రజ్ఞులు
- క్లినికల్ ట్రయల్స్ సక్సెస్
మాస్కో, జూలై 12: ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆక్స్ఫర్డ్ టీకా వైపు.. అమెరికా చెందిన మోడెర్నా కంపెనీ టీకావైపు.. మన భారతీయులు కోవాగ్జిన్ కోసం ఆశగా ఎదురుచూస్తుంటే రష్యా శాస్త్రజ్ఞులు నిశ్శబ్దంగా క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తిచేసేశారు. ప్రపంచపు తొలి కొవిడ్-19 వ్యాక్సిన్ను సిద్ధం చేశారు. ఈ విషయాన్ని మాస్కోలోని సేచెనోవ్ యూనివర్సిటీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. రష్యాలోని ‘గమలీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ’ శాస్త్రజ్ఞులు ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. జూన్ 18న క్లినికల్ ట్రయల్స్ను ప్రారంభించారు. ‘‘ప్రపంచపు తొలి కరోనా వ్యాక్సిన్ పరీక్షలను వాలంటీర్లపై సేచెనోవ్ యూనివర్సిటీ విజయవంతంగా పూర్తిచేసింది’’ అని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ’ డైరెక్టర్ వాదిమ్ తారసోవ్ తెలిపారు. క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్నవారిలో తొలి బృందాన్ని బుధవారం(జూలై 15), రెండో బృందాన్ని జూలై 20న డిశ్చార్జి చేయనున్నామని వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాక్సిన్లలాగానే ఇది కూడా సురక్షితమేనని సేచెనోవ్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అలెగ్జాండర్ లుకషేవ్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ రూపకర్తలు దీని ఉత్పత్తి పెంపునకు సంబంధించి ప్రణాళికలు రచిస్తున్నారని వాదిమ్ తారసోవ్ వెల్లడించారు. అయితే, దీన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేదీ లేనిదీ తెలుపలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ వ్యాక్సిన్ను తొలుత ద్రవరూపంలో బుర్డెంకో సైనిక ఆస్పత్రిలో పరీక్షించారు. సేచెనోవ్ వర్సిటీలో పరీక్షించింది పొడి రూపంలో ఉండే వ్యాక్సిన్. దాంతో సొల్యూషన్ను తయారుచేసి కండరాల ద్వారా ఇస్తారు. 18, 20 మంది సభ్యులున్న రెండు బృందాలపై దీన్ని పరీక్షించారు. వ్యాక్సిన్ ఇచ్చాక 28 రోజులపాటు వారిని ఆస్పత్రిలోనే పరిశీలనలో ఉంచారు. రెండు బృందాల్లోని వాలంటీర్లలోనూ రోగనిరోధక వ్యవస్థ కరోనాకు వ్యతిరేకంగా ఉత్తేజితమైనట్టు గుర్తించామని వ్యాక్సిన్ రూపకర్తలు వెల్లడించారు. అయితే.. కేవలం 18, 20 మందిపై పరీక్షలు నిర్వహించి ఈ వ్యాక్సిన్ విజయవంతమైందని ప్రకటించడంపై పలువురు వైద్యనిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2020-07-13T13:53:32+05:30 IST