యూఏఈలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
ABN, First Publish Date - 2020-08-15T17:03:32+05:30
దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆన్లైన్లో వీక్షించిన ప్రవాసులు
యూఏఈ: దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి జాతీయ జెండాను ఎగురవేశారు. మహమ్మారి కోవిడ్ నేపథ్యంలో ఈసారి ఈ కార్యక్రమానికి పబ్లిక్ను అనుమతించలేదు. కేవలం కార్యాలయం సిబ్బంది, అధికారులు మాత్రమే హాజరయ్యారు. దీంతో దుబాయిలోని భారత ప్రవాసులు ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కాన్సులేట్ ఆఫ్ ఇండియా అధికారిక సోషల్ మీడియా వెబ్సైట్స్(ఫేస్బుక్, ట్విట్టర్)లో ప్రవాసుల కోసం ఈ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుబాయికి చెందిన ప్రముఖ గాయకుడు సూరజ్ భారతి దేశభక్తి గీతం పాడగా, ఒక నృత్య బృందం వేదిక వద్ద శాస్త్రీయ నృత్యాలు చేసింది.
అనంతరం కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి ఈ సభలో ప్రసంగించారు. "భారతీయ సమాజంలోని సభ్యులు, మా ఎమిరాటి స్నేహితులు, దుబాయ్, ఉత్తర ఎమిరేట్స్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు ప్రత్యేకంగా స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని అన్నారు. యూఏఈ, భారతదేశం భాగస్వామ్యం ఈ అనిశ్చిత సమయాల్లో బలంగా ఉందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా భారతీయ సమాజానికి యూఏఈ అన్ని విధాలుగా సహకరించిందని గుర్తు చేశారు.
Updated Date - 2020-08-15T17:03:32+05:30 IST