దుబాయిలోని ఎన్నారైల సమస్యల పరిష్కారానికి సింగిల్ విండో విధానం
ABN, First Publish Date - 2020-08-01T18:57:26+05:30
దుబాయిలోని ప్రవాస భారతీయుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు ఇండియన్ ఎంబసీ సింగిల్ విండో ఈ-హెల్ప్లైన్ విధానాన్ని ప్రారంభించింది.
దుబాయి: దుబాయిలోని ప్రవాస భారతీయుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు ఇండియన్ ఎంబసీ సింగిల్ విండో ఈ-హెల్ప్లైన్ విధానాన్ని ప్రారంభించింది. ఇవాళ్టి(ఆగస్టు 1వ తేదీ) నుంచే ఈ విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు ఇండియన్ కాన్సుల్ జనరల్ అమన్ పూరీ వెల్లడించారు. ధృవపత్రాలకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న వారు, డిస్ట్రెస్ కేసులు గల వారు తమ సమస్యలను వివరిస్తూ సింగిల్ విండో విధానం ద్వారా నేరుగా ఇండియన్ ఎంబసీని సంప్రదించే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనికోసం అధికార వెబ్సైట్ https://www.cgidubai.gov.in/లో హెల్ప్లైన్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రవాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ దౌత్య కార్యాలయన్ని సంప్రదించాలనుకుంటే https://www.cgidubai.gov.in/helpline.php వెబ్సైట్లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని అమన్ పూరీ తెలియజేశారు.
Updated Date - 2020-08-01T18:57:26+05:30 IST