కొవిడ్-19: రష్యాను దాటేసి.. మూడో స్థానానికి చేరిన భారత్
ABN, First Publish Date - 2020-07-06T03:25:01+05:30
కరోనా మహమ్మారి భారతదేశాన్ని కబళిస్తోంది. దేశంలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తూ పోతోంది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారతదేశాన్ని కబళిస్తోంది. దేశంలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తూ పోతోంది. ఇక తాజాగా నమోదైన కేసులతో భారత్ రష్యాను అధిగమించి అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో మూడో స్థానానికి చేరింది. రష్యాలో ఇప్పటివరకు 6,81,251 కరోనా కేసులు నమోదుకాగా.. భారత్లో 6,95,396 కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికా, బ్రెజిల్ తరువాతి స్థానంలో ఇప్పుడు భారతదేశం నిలిచింది. మరోపక్క రష్యా వ్యాప్తంగా కరోనా బారిన పడి 10,161 మంది మరణించగా.. భారత్లో ఇప్పటివరకు 19,692 మంది మృత్యువాతపడ్డారు. భారత్లో నిత్యం 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 25 వేల కరోనా కేసులు నమోదైనట్టు.. 613 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. భారత్లో నిత్యం కరోనా కేసుల సంఖ్య పెరగడమే కాని ఎక్కడా తగ్గుముఖం కనిపించడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. మహారాష్ట్రలో తాజాగా 7 వేలకు పైగా కేసులు నమోదుకాగా.. తమిళనాడులో 4,200కు పైగా, ఢిల్లీలో 2,500కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచదేశాల మాదిరిగానే భారత్ మార్చి నెలాఖరు నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించింది. ప్రపంచదేశాల కంటే భారత్ లాక్డౌన్ను సమర్థవంతంగా అమలు చేయగలిగింది. అయితే లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడంతో దేశంలో కేసులు పెరుగుతూ పోతున్నాయి.
Updated Date - 2020-07-06T03:25:01+05:30 IST