టాయిలెట్ పేపర్ల కోసం తల్లిపై చేయి చేసుకున్న కొడుకు.. పోలీసులకు పట్టించిన తల్లి..
ABN, First Publish Date - 2020-04-10T18:53:53+05:30
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా అమెరికాలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యంలో నిత్యావసరాలు దొరకడం కూడా గగనంగా మారుతోంది.
లాస్ ఏంజిల్స్: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా అమెరికాలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యంలో నిత్యావసరాలు దొరకడం కూడా గగనంగా మారుతోంది. మరోవైపు అమెరికన్లకు నిత్యావసర సరుకుల కోరత కూడా వెంటాడుతోంది. నిత్యావసరాల కోరత కారణంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా లాస్ ఏంజిల్స్లో తల్లి, కొడుకు మధ్య టాయిలెట్ పేపర్ల కోసం జరిగిన ఘర్షణ... కుమారుడిని కటకటాల పాలు చేసింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో అక్కడ టాయిలెట్ పేపర్ల కొరత ఉంది. దీంతో విచ్చలవిడిగా ఈ పేపర్లను వాడుతున్న కుమారుడిని తల్లి వారించింది.
అంతే... అది నచ్చని కొడుకు తల్లిపై చేయి చేసుకున్నాడు. తల్లిని ముఖంపై కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దాంతో పోలీసులకు ఫోన్ చేసి ఆమె జరిగిన విషయం చెప్పింది. ఈ ఘటన నార్త్ లాస్ ఏంజిల్స్లోని సౌగస్ అనే ప్రాంతంలో సోమవారం జరిగింది. తల్లి ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కుమారుడు అడ్రియన్ యాన్(26)ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని శాంటా క్లారిటా వ్యాలీ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు షిర్లీ మిల్లెర్ అనే పోలీస్ అధికారిణి తెలియజేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నగర వ్యాప్తంగా ఆంక్షలు విధించడంతో ఇలా నిత్యావసరాల కోసం కుటుంబ సభ్యులు ఘర్షణ పడుతున్న సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆమె చెప్పారు.
Updated Date - 2020-04-10T18:53:53+05:30 IST