అబుధాబి బిగ్ టికెట్లో జాక్పాట్ కొట్టిన 20 మంది భారత మిత్ర బృందం
ABN, First Publish Date - 2020-07-04T15:42:42+05:30
దుబాయిలో ఉండే 20 మంది భారతీయ మిత్ర బృందం అబుధాబి డ్యూటీ ఫ్రీ బిగ్ టికెట్ లాటరీలో జాక్పాట్ కొట్టారు.
అబుధాబి: దుబాయిలో ఉండే 20 మంది భారతీయ మిత్ర బృందం అబుధాబి డ్యూటీ ఫ్రీ బిగ్ టికెట్ లాటరీలో జాక్పాట్ కొట్టారు. బంపర్ ప్రైజ్ కింద ఏకంగా 15 మిలియన్ దిర్హామ్స్(రూ.30.5 కోట్లు) గెలుచుకున్నారు. దీంతో రాత్రికి రాత్రే వారందరూ కోటిశ్వర్లుగా అవతరించారు. కేరళ రాష్ట్రం కన్నూర్కు చెందిన నౌఫల్ మాయన్ కలతిల్ తన 20 మంది స్నేహితులతో కలిసి జూన్ 25న కొన్న 101341 నెంబర్ గల లాటరీ టికెట్కు ఈ బంపర్ ప్రైజ్ తగిలింది. దాంతో ఈ మిత్ర బృందం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రతి ఏడాది ఈ 20 మంది మిత్రులు క్రమం తప్పకుండా 6 లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవారట.
చివరకు ఈ ఏడాది వారికి అదృష్టం కలిసి రావడంతో రూ.30.5 కోట్ల లాటరీ తగిలింది. ఇక తాము గెలుచుకున్న ఈ భారీ మొత్తంలో తమ అవసరాలకు సరిపడ ఉంచుకుని మిగిలిన దానిని కోవిడ్ వల్ల గల్ఫ్లో అష్టకష్టాలు పడుతున్న భారత ప్రవాసుల కోసం వినియోగిస్తామని తెలిపారు. వీరితో పాటు మరో 12 మంది భారతీయులు కూడా ఈ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచారు. వీరిలో ఓ భారత పౌరుడు ఒక లక్జరీ కారు గెలుచుకున్నాడు.
Updated Date - 2020-07-04T15:42:42+05:30 IST