మా నాన్నను అవమానిస్తారా?
ABN, First Publish Date - 2020-02-23T06:16:13+05:30
హిందీ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్పై కథానాయిక సోనమ్ కపూర్ కారాలు, మిరియాలు నూరుతున్నారు.
ఆయనతో ఒక్క మాట చెప్పరా??
హిందీ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్పై కథానాయిక సోనమ్ కపూర్ కారాలు, మిరియాలు నూరుతున్నారు. సోషల్ మీడియా సాక్షిగా అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణం... ‘మిస్టర్ ఇండియా’ రీమేక్! సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’, ‘భారత్’ చిత్రాలు తెరకెక్కించిన అలీ అబ్బాస్ జాఫర్ విజయాలు అందుకున్నారు. ఇటీవల ‘మిస్టర్ ఇండియా’ను రీమేక్ చేస్తున్నట్టు, మూడు భాగాలుగా తెరకెక్కించనున్నట్టు ఆయన తెలిపారు. ‘‘ప్రతిఒక్కరూ ప్రేమించిన పాత్రను ముందుకు తీసుకువెళ్లడం చాలా పెద్ద బాధ్యత. ‘మిస్టర్ ఇండియా’ ట్రయాలజీ కోసం జీ స్టూడియోస్తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. యాక్టర్స్గా ఎవరినీ ఎంపిక చేయలేదు. స్ర్కిప్ట్ పూర్తి చేసిన తర్వాత నటీనటుల ఎంపిక ప్రారంభిస్తాం’’ అని అలీ అబ్బాస్ జాఫర్ పేర్కొన్నారు.
సుమారు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ‘మిస్టర్ ఇండియా’లో సోనమ్ తండ్రి, ప్రముఖ హిందీ నటుడు అనిల్ కపూర్ హీరోగా నటించారు. ఆయన్ను సంప్రదించకుండా రీమేక్ ప్రకటించడంపై సోనమ్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చాలామంది ‘మిస్టర్ ఇండియా’ రీమేక్ గురించి నన్ను అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే... మా నాన్నకు ఆ సినిమాను మళ్లీ తీస్తున్నట్టు తెలియదు. అలీ అబ్బాస్ జాఫర్ ట్వీట్ చూసి మేం తెలుసుకున్నాం. అదే నిజమైతే... ‘మిస్టర్ ఇండియా’ చిత్రనిర్మాణంలో ప్రధాన భూమిక పోషించిన మా నాన్న, శేఖర్ అంకుల్ (దర్శకుడు శేఖర్ కపూర్)ను సంప్రదించకపోవడం వాళ్లను అగౌరవపరచడమే. లెక్కలు, ప్రకటనలు పక్కనపెడితే... మా నాన్న ఎంతో కష్టపడి, హృదయంతో ఆ సినిమా చేశారు. ఆయన లెగసీలో ‘మిస్టర్ ఇండియా ఒక భాగం. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో పాటు ఇతరుల పనినీ గౌరవిస్తారని ఆశిస్తున్నా’’ అని సోనమ్ కపూర్ తెలిపారు.
మరోవైపు శేఖర్ కపూర్ కూడా ఈ విషయం మీద స్పందించారు. ‘‘భారీ వసూళ్ల కోసం మా టైటిల్ మాత్రమే వాడుతున్నారని అనుకుంటున్నా. నన్ను ఎవరూ ‘మిస్టర్ ఇండియా 2’ గురించి సంప్రదించలేదు. ఒరిజినల్ సినిమా సృష్టికర్తలమైన మా అనుమతి లేకుండా మా సినిమా కథ, అందులో పాత్రలను ఉపయోగించుకోవడానికి వీల్లేదు’’ అని ఆయన ట్వీట్ చేశారు.
Updated Date - 2020-02-23T06:16:13+05:30 IST