మొలకలా..? తృణధాన్యాలా..?
ABN, First Publish Date - 2020-05-16T05:30:00+05:30
తృణధాన్యాలు తింటే మంచిదని సాయంకాలం రోజూ ఒక కప్పు సెనగలు తింటున్నా. కానీ రాత్రి డిన్నర్ సమయానికి పొట్ట ఉబ్బరించినట్టు ఉంటోంది. మొలకలు మంచివా? లేదా తృణధాన్యాలు మంచివా...
తృణధాన్యాలు తింటే మంచిదని సాయంకాలం రోజూ ఒక కప్పు సెనగలు తింటున్నా. కానీ రాత్రి డిన్నర్ సమయానికి పొట్ట ఉబ్బరించినట్టు ఉంటోంది. మొలకలు మంచివా? లేదా తృణధాన్యాలు మంచివా? గ్యాస్ రాకుండా ఎలా తినొచ్చు?
- నళిని, వరంగల్
ఇది చాలా సాధారణ సమస్య. చాలామందికి పప్పు దినుసులు, తృణధాన్యాలు, మొలకెత్తిన ధాన్యాలు తినడం వల్ల గ్యాస్ వస్తుంది. అందుకు మీరు పాటించాల్సిన జాగ్రత్తలివి...
- పప్పు దినుసులు, తృణధాన్యాలు కనీసం 4 నుంచి 6 గంటలు నానబెట్టి బాగా కడిగితే గ్యాస్ను పెంచే పదార్థాలు తగ్గుతాయి. రోజుకు అరకప్పు మించకుండా తినాలి. వీటిని ఒక్కసారి కాకుండా, అన్నంలో లేదా కూరలో కలిపి వాడితే గ్యాస్ను తగ్గించవచ్చు.
- మొలకలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని అల్పాహారంలో భాగంగా తినొచ్చు. మొలకలు రావడం వల్ల ప్రొటీన్స్, అమినో యాసిడ్స్లా మారుతాయి. అలాగే పిండి పదార్థాలు చక్కెరగా మారుతాయి. అరుగుదల బాగా పెరుగుతుంది. మొలకలు డైరెక్ట్గా తినొచ్చు లేదా కలుపుగా కూడా తీసుకోవచ్చు.
- తృణధాన్యాలు, మొలకల్లో ప్రొటీన్లు మాంసాహారంలో ఉన్నట్టుగా ఉంటాయి. ప్రొటీన్స్తో పాటు ఐరన్, కాల్షియం కూడా వీటి నుంచి వస్తుంది. మాంసాహారంలో లేనిది, వీటిల్లో ఉన్నది ఫైబర్ అంటే పీచు పదార్థం. అందుకే వీటిని రోజూ తీసుకోవడం అవసరం. ఇవి తింటున్నప్పుడు నిమ్మరసం కలపడం వల్ల ఐరన్, కాల్షియం శోషణ బాగా ఉంటుంది.
- కొందరికి పప్పు తిన్నా, తినకపోయినా గ్యాస్ ఉంటుంది. వీరు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. తృణధాన్యాలు తినడం వల్ల మలబద్ధకం పోతుంది. అలాగే కొన్ని రోజులు ప్రొ బయాటిక్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం తగ్గుతుంది.
-డాక్టర్ బి.జానకి, న్యూట్రిషనిస్ట్
drjanakibadugu@gmail.com
Updated Date - 2020-05-16T05:30:00+05:30 IST