నిప్పుతో చెలగాటం!
ABN, First Publish Date - 2020-03-08T06:01:07+05:30
అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా రాణిస్తామని మహిళలు రుజువు చేస్తున్నారు. పురుషులకే పరిమితం అనే అభిప్రాయం ఉన్న వృత్తుల్లో సైతం సత్తా చూపిస్తున్నారు. కత్తి మీద సాములాంటి...
అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా రాణిస్తామని మహిళలు రుజువు చేస్తున్నారు. పురుషులకే పరిమితం అనే అభిప్రాయం ఉన్న వృత్తుల్లో సైతం సత్తా చూపిస్తున్నారు. కత్తి మీద సాములాంటి అగ్నిమాపక దళ సేవల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు.
మీకు తెలుసా? ఆసియాలోనే మొదటిసారిగా అందరూ మహిళలే ఉన్న విమానాశ్రయ అగ్నిమాపక దళం మన దేశంలోనే ఉంది. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన మాక్ డ్రిల్లో ఈ దళం సభ్యులు తమ నైపుణ్యాలు ప్రదర్శించి ‘శభాష్’ అనిపించుకున్నారు. నిప్పుతో చెలగాటం ఆడే ఈ వృత్తిలో మహిళలకు గతంలో ప్రవేశం ఉండేది కాదు. 2006లో, మన దేశంలో మొదటి మహిళా ఫైర్ ఫైటర్గా హర్షిణి కన్హకర్ చరిత్రకెక్కారు. నాగపూర్లోని జాతీయ అగ్నిమాపక సేవల కళాశాల (ఎన్ఎఫ్ఎస్సి)లో ఆమె చేరేనాటికి ఆ కోర్సులో మహిళలలకు అనుమతి లేదు. హర్షిణి ఆసక్తిని గమనించిన కళాశాల వర్గాలు ఆమెను డే స్కాలర్గా తీసుకోవడానికి కేంద్ర హోం శాఖ నుంచి ప్రత్యేక అనుమతిని పొందాల్సి వచ్చింది.
విమానాశ్రయాల విషయానికి వస్తే, 2018లో భారత విమానాశ్రయాల సంస్థ (ఎఎఐ) మొదటి మహిళా ఫైర్ఫైటర్గా కోల్కతాకు చెందిన తనియా సన్యాల్ను నియమించింది. అలాగే చెన్నై విమానాశ్రయంలోని అగ్నిమాపక విభాగంలో తొలి మహిళగా, 28 ఏళ్ళ రమ్యా శ్రీకాంతన్ జూనియర్ అసిస్టెంట్ బాధ్యతలను కిందటి ఏడాది నవంబర్లో చేపట్టారు. ఇప్పుడు 14 మంది సభ్యులతో ఆసియాలోనే తొలి పూర్తిస్థాయి మహిళా ఫైర్ ఫైటర్స్ దళం బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో సేవలు అందిస్తోంది. 2018 ఫిబ్రవరి 18న వీరు ఈ విభాగంలో చేరారు. కోల్కతాలోని ఎఎఐ అగ్నిమాపక సేవల శిక్షణ కేంద్రంలో నాలుగు నెలలు వీరు శిక్షణ పొందారు. ప్రమాదాలు తలెత్తినప్పుడు సత్వర స్పందన, విపత్తు నిర్వహణ, ప్రయాణికుల తరలింపు, సహాయక చర్యలను వీరు చేపడతారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో మరోసారి తమ నైపుణ్యాలను చాటి చెప్పడానికి ఈ దళం సిద్ధమయింది.
Updated Date - 2020-03-08T06:01:07+05:30 IST