అందరికి వ్యాక్సిన్ అందాలంటే ఐదేళ్లు పడుతుంది: సీరమ్ ఇన్స్టిట్యూట్
ABN, First Publish Date - 2020-09-15T02:44:43+05:30
కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చినా.. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చినా.. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలంటే కనీసం నాలుగైదేళ్ల సమయం పడుతుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) సీఈఓ అదార్ పూనావాలా హెచ్చరించారు. ఒకవేళ రెండు డోస్ల వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తే.. ప్రపంచం మొత్తం 1500 కోట్ల వ్యాక్సిన్లు అవసరమవుతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల సమయం పడుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా వ్యాక్సిన్లను సీఐఐ తయారు చేస్తోన్న విషయం తెలిసిందే. ఐదు అంతర్జాతీయ ఫార్మా సంస్థలతో వ్యాక్సిన్ తయారీకి సీఐఐ ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో ఆస్ట్రాజెనెకా, నోవావ్యాక్స్ సంస్థలు కూడా ఉన్నాయి. ముందుగా వంద కోట్ల వ్యాక్సిన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సీఐఐ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో 50 కోట్ల వ్యాక్సిన్లు భారత ప్రజలకే ఇవ్వనున్నారు. కాగా.. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ చెప్పిన మరుసటి రోజే అదార్ పూనావాలా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
Updated Date - 2020-09-15T02:44:43+05:30 IST