కరోనాపై యుద్ధానికి వెయ్యి మంది నర్సుల్ని నియమిస్తాం: పళనిస్వామి
ABN, First Publish Date - 2020-04-25T23:26:44+05:30
ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయబోయే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలను మరో రెండు నెలలు వినియోగించుకోవడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామక ఉత్తర్వులు ఇస్తామని పళనిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు
చెన్నై: కోవిడ్-19పై వ్యతిరేకంగా పోరాటంలో ఆరోగ్య సంరక్షణ శ్రామిక శక్తిని పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి అన్నారు. దానికోసం ఈ నెలలో పదవీ విరమణ చేయబోయే 1,000 మంది నర్సులను నియమించి ప్రభుత్వ వైద్యుల సేవలను కొనసాగించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయబోయే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలను మరో రెండు నెలలు వినియోగించుకోవడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామక ఉత్తర్వులు ఇస్తామని పళనిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. 1,323 మంది నర్సులను మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియమించుకున్నామని, వారికి నియామక ఉత్తర్వులు జారీ చేయబడుతున్నాయని, ఉత్తర్వులు వచ్చిన వెంటనే చేరాలని సూచించినట్లు ఆయన తెలిపారు.
ఇటీవల ప్రభుత్వం 530 మంది వైద్యులను, 1,000 మంది నర్సులను, 1,508 ల్యాబ్ టెక్నీషియన్లను ప్రభుత్వ ఆసుపత్రులలో నియమించింది. మార్చి 31న పదవీ విరమణ చేసిన వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలను కాంట్రాక్టుపై మరో రెండు నెలలు పొడిగించి వారి సేవల్ని వినియోగించనున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు.
Updated Date - 2020-04-25T23:26:44+05:30 IST