పార్కులోకి వరద.. మేకల దొడ్డిలో దూరిన పెద్దపులి!
ABN, First Publish Date - 2020-07-14T18:17:42+05:30
అసోంలోని కజిరంగా జాతీయ పార్కు పరిసరాల్లో ఓ పెద్దపులి కలకలం రేపింది. పార్కులోకి భారీగా వరద నీరు చేరడంతో..
గువాహటి: అసోంలోని కజిరంగా జాతీయ పార్కు పరిసరాల్లో ఓ పెద్దపులి కలకలం రేపింది. పార్కులోకి భారీగా వరద నీరు చేరడంతో ఆశ్రయం కోసం అది ఓ మేకల దొడ్డిలో దూరింది. అగ్రతోలి రేంజ్లోని కాందోలిమారి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పార్క్ డైరెక్టర్ పి. శివకుమార్ వెల్లడించారు. ‘‘వరదనీరు పెరగడంతో సురక్షిత ప్రాంతాన్ని వెతుక్కుంటూ వచ్చిన పులి ఓ మేకలదొడ్డిలో దూరింది. ప్రజలకు, పులికి ఎలాంటి హాని జరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం...’’ అని ఆయన పేర్కొన్నారు. నిన్న ఉదయం అక్కడికి వచ్చిన పులి ఎట్టకేలకు మధ్యాహ్నం అడవుల్లోకి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా సగం వరకు నీళ్లలో మునిగిన పెద్దపులి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ నేషనల్ పార్కు దాదాపు నీటమునిగిపోయింది. 95 శాతం పార్కులోని ప్రదేశాలు జలమయం కావడంతో మూగజీవాలన్నీ ఆశ్రయం కోసం ఎగువ ప్రాంతాలకు తరలుతున్నాయి.
Updated Date - 2020-07-14T18:17:42+05:30 IST