కారు కొనే ఆలోచన మానుకొని పిల్లలకు 343 ట్యాబ్లు, 30వేల మాస్కులు!
ABN, First Publish Date - 2020-12-30T08:53:04+05:30
ఆయనో ఎలిమెంటరీ స్కూల్ టీచర్. వచ్చే జీతం.. భార్య, ఐదుగురు పిల్లల పోషణకే సరిపోదు. అలాంటిది వారసత్వంగా
విద్యాసంవత్సరం నష్టపోవొద్దనే.. ఇరాన్లో ఓ ఉపాధ్యాయుడి ఆదర్శం
న్యూఢిల్లీ, డిసెంబరు 29: ఆయనో ఎలిమెంటరీ స్కూల్ టీచర్. వచ్చే జీతం.. భార్య, ఐదుగురు పిల్లల పోషణకే సరిపోదు. అలాంటిది వారసత్వంగా ఆయనకు రూ.2.2 కోట్లు సంక్రమించాయి! అందులోంచి కొంత మొత్తంతో ఓ ఖరీదైన కారు కొందామని అనుకున్నాడు. అదే సమయంలో కరోనా కారణంగా బడి పిల్లలు ఇంటికే పరిమితమైపోయారని తెలిసి తన ఆలోచనను మానుకున్నాడు. చదువుకు దూరమైతే ఆ ఏడాదంతా విద్యార్థులు నష్టపోతారని భావనతో కారు కొనాలనుకున్న డబ్బుతో వారు ఇంట్లోనే ఉండి చదువు కొనసాగించేలా ఏర్పాట్లు చేశాడు. 343 మంది పిల్లలకు తలా ఒక ట్యాబ్ చొప్పున కొన్నాడు. వారి కోసం మరో 30వేల మాస్కులను కొనుగోలు చేశాడు. ఇరాన్లోని ఖుజెస్థాన్ ప్రావిన్సుకు చెందిన అసాదీ (50) అనే వ్యక్తి ఆదర్శమిది! బంధువులు, చుట్టుపక్కల వారంతా.. ‘‘ వచ్చే జీతంతో ఓ ఇంటినో.. కారునో కొనడం నీ ఎన్నడూ వల్ల కాదు.. అలాంటిది ఏంటీ పిచ్చిపని’’ అంటూ అసాదీని ఎగతాళి చేశారు. దానికి అసాదీ ఏం చెప్పాడో తెలుసా? ‘‘నేనిచ్చిన బహుమతితో తమ చదువు ఇక ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతుందని పిల్లల ముఖాల్లో కనిపిస్తున్న అందమైన నవ్వే నాకు చాలు. అదే కొండంత సంతృప్తినిస్తోంది’’ అని. తన ఆదర్శంతో అసాదీ నేషనల్ హీరో అయిపోయారు. ఆయన్ను అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Updated Date - 2020-12-30T08:53:04+05:30 IST