లాక్డౌన్: జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
ABN, First Publish Date - 2020-04-09T20:38:17+05:30
జమ్మూ కశ్మీర్లో 4జీ సేవల పునరుద్ధరణపై అక్కడి ప్రభుత్వ యంత్రాంగానికి ఇవాళ సుప్రీంకోర్టు...
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో 4జీ సేవల పునరుద్ధరణపై అక్కడి ప్రభుత్వ యంత్రాంగానికి ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ అనే ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం చెప్పాలని ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టగా.. వీడియో కాన్ఫరెన్సు ద్వారా పిటిషనర్ తరపు లాయర్ హుజెఫా అహ్మది వాదనలు వినిపించారు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ను 4జీ నెట్వర్క్తో అనుసంధానం చేయడం అత్యవసరమని అహ్మది నివేదించారు. ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంటేనే విద్యార్ధులకు వర్చువల్ క్లాసులు నిర్వహణ, మంచి కనెక్టివిటీ సాధ్యమవుతుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
గతేడాది ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. పోస్టు పెయిడ్ మొబైల్ ఫోన్లపై 2జీ సర్వీసులు, బ్రాడ్బ్యాండ్ సర్వీసులు ఇప్పటికే పునరుద్ధరించగా.. 4జీ సేవలపై నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Updated Date - 2020-04-09T20:38:17+05:30 IST