లాక్డౌన్ ఎఫెక్ట్: అమరుల కుటుంబాలకు అండగా నిలిచిన పోలీసు అధికారి
ABN, First Publish Date - 2020-04-01T22:56:06+05:30
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలను తమవంతుగా ఆదుకుంటూ అనేక..
రాయ్పూర్: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలను తమవంతుగా ఆదుకుంటూ అనేక మంది ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఛత్తీస్గఢ్లోని జోష్పూర్ జిల్లాలో ఓ పోలీస్ అధికారి తన సొంత జీతంతో ఆరు కుటుంబాలకు భోజన వసతి కల్పిస్తూ, మందులు ఇస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ ఆరు కుటుంబాలు పోలీసు అమరవీరుల కుటుంబాలు కావడం విశేషం. ఆప్తులను కోల్పోయి అనాథలుగా మిగిలిన సహచరుల కుటుంబాలకు అండగా నిలవడం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని కున్కూరిలో ఎస్హెచ్వోగా పనిచేస్తున్న విశాల్ కుజూర్ పేర్కొన్నారు.
‘‘మాతృభూమికి సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను ఆదుకోవడం మనందరి విధి...’’ అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తన సహచరుడు ఒకరు ప్రాణాలు కోల్పోవడం చూశాననీ.. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబం కష్టాల్లో చిక్కుకున్నట్టు తనకు తెలిసిందన్నారు. దీంతో తన పరిధిలోని పోలీసు అమరుల కుటుంబాలన్నిటినీ ఆదుకోవాలని నిర్ణయించుకున్నట్టు విశాల్ పేర్కొన్నారు.
Updated Date - 2020-04-01T22:56:06+05:30 IST