ప్రైవేట్ పాఠశాలల్లో వసూళ్లవేట సాగిస్తే..
ABN, First Publish Date - 2020-04-05T12:45:39+05:30
ప్రైవేట్ పాఠశాలల్లో వసూళ్లవేట సాగిస్తే..
చెన్నై, (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు లాక్డౌన్, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠాశాలల విద్యాశాఖ మంత్రి కేఏ సెంగోటయ్యన్ హెచ్చరించారు. గోపిశెట్టి పాళయంలో శనివారం ఉదయం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను అత్యవసరంగా చెల్లించమంటూ వసూళ్ళవేటను ప్రారంభించినట్టు తనకు ఫిర్యాదులు అందాయని చెప్పారు. రాష్ట్రమంతటా కరోనా వైరస్ నిరోధక చర్యల కోసం లాక్డౌన్ అమలు చేస్తున్న సమయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బలవంతపెడితే చూస్తూ ఊరుకోమని, అలాంటి పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, మందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ముందజంలో ఉందన్నారు. లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు కాయగూరాలను అందించాలన్న తలంపుతో గోపిశెట్టిపాళయంలో సంచార కాయగూరల దుకాణాలను ప్రారంభించినట్టు తెలిపారు. బెల్ సంస్థ రూపొందించిన భారీ యంత్రంద్వారా క్రిమిసంహరాక మందులు చల్లే కార్యక్రమం రాష్ట్రంలోనే తొలిసారిగా ఈరోడ్, గోపిశెట్టిపాళయం ప్రాంతాల్లో చేపడుతున్నట్టు ఆయన చెప్పారు.
Updated Date - 2020-04-05T12:45:39+05:30 IST