హర్సిమ్రత్ రాజీనామా మోదీని కుదిపేసింది : సుఖ్బిర్ బాదల్
ABN, First Publish Date - 2020-09-26T00:52:54+05:30
శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) నేతస లోక్సభ సభ్యుడు సుఖ్బిర్ బాదల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ : శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) నేతస లోక్సభ సభ్యుడు సుఖ్బిర్ బాదల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నేత హర్సిమ్రత్ కౌర్ ఇటీవల కేంద్ర మంత్రి పదవికి చేసిన రాజీనామాను అణు బాంబుతో పోల్చారు. ఆమె రాజీనామా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కుదిపేసిందన్నారు.
ఇటీవల పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ సంస్కరణల బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్లోని ముక్త్సర్లో శుక్రవారం జరిగిన సభలో సుఖ్బిర్ బాదల్ మాట్లాడారు. గత రెండు నెలల్లో రైతుల గురించి ఎవరూ మాట్లాడలేదని, హర్సిమ్రత్ కౌర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు రైతుల సమస్యలపై క్రమం తప్పకుండా ఐదుగురేసి మంత్రులు మాట్లాడుతున్నారని చెప్పారు.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ను అణు బాంబుతో అమెరికా కుదిపేసిందని, ఇప్పుడు అకాలీదళ్కు చెందిన ఓ బాంబు మోదీని కుదిపేసిందని చెప్పారు. హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని అణు బాంబుతో పోల్చారు.
శిరోమణి అకాలీ దళ్ ప్రస్తుతం జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే)లో భాగస్వామ్య పక్షంగానే ఉంది. అయినప్పటికీ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్లో శుక్రవారం మూడు గంటలపాటు రాస్తా రోకో నిర్వహించింది.
ఇటీవల ఈ పార్టీ నేతలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. వ్యవసాయ బిల్లులపై సంతకం చేయవద్దని కోరారు.
హర్సిమ్రత్ కౌర్ బాదల్, సుఖ్బిర్ బాదల్ దంపతులు. తమ పార్టీ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు చెప్తూ, ఆమె కేంద్ర మంత్రి పదవికి ఈ నెల 17న రాజీనామా చేశారు.
Updated Date - 2020-09-26T00:52:54+05:30 IST