రిలయన్స్ టెస్ట్ కిట్.. 2 గంటల్లో ఫలితం
ABN, First Publish Date - 2020-10-03T08:13:13+05:30
రెండు గంటల్లో ఫలితాన్ని తెలిపే పూర్తిస్థాయి దేశీ ‘ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కిట్’ను ముకేశ్ అంబానీకి చెందిన ‘రిలయన్స్ లైఫ్ సైన్సెస్’ అభివృద్ధి చేసింది...
కిట్ను అభివృద్ధి చేసిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్
న్యూఢిల్లీ, అక్టోబరు 2: కరోనా సోకిందీ లేనిదీ తెలుసుకోవడానికి పరమ ప్రామాణికమైన పరీక్ష.. ఆర్టీపీసీఆర్ టెస్ట్. కానీ, ఆ పరీక్ష ఫలితం రావడానికి 24 గంటలు, అంతకన్నా ఎక్కువే సమయం పడుతుంది. అందుకే చాలామంది.. అరగంటలో ఫలితాన్నిచ్చే యాంటీజెన్ టెస్టు చేయించుకుంటున్నారు. కానీ, ఆ పరీక్షలో నెగెటివ్ వస్తే మళ్లీ పరీక్ష చేయించాల్సిందే. ఈ సమస్యకు విరుగుడుగా.. రెండు గంటల్లో ఫలితాన్ని తెలిపే పూర్తిస్థాయి దేశీ ‘ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కిట్’ను ముకేశ్ అంబానీకి చెందిన ‘రిలయన్స్ లైఫ్ సైన్సెస్’ అభివృద్ధి చేసింది. ఆ సంస్థలోని కంప్యూటేషనల్ బయాలజిస్టులు 100కు పైగా కరోనా వైరస్ జినోమ్లను విశ్లేషించి.. సరికొత్త ఆర్టీపీసీఆర్ ప్రైమర్స్ను రూపొందించారు. వాటి సాయంతో.. రెండు గంటల్లోగా కచ్చితమైన ఫలితాలను తెలిపే ఆర్టీపీసీఆర్ కిట్ను అభివృద్ధి చేశారు. దానికి వారు ‘ఆర్-గ్రీన్ కిట్ (సార్స్ కొవ్2-రియల్ టైమ్ పీసీఆర్)’గా నామకరణం చేశారు. ఐసీఎంఆర్ దీన్ని సాంకేతికంగా వ్యాలిడేట్ చేసినట్టు సమాచారం. అంటే.. ఐసీఎంఆర్ దీన్ని ధ్రువీకరించినట్టు కాదుగానీ.. దాని పనితీరుపై సంతృప్తి చెందినట్టు లెక్క అని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఆర్గ్రీన్ కిట్ కరోనా వైర్సలోని ఈ-జీన్, ఆర్-జీన్, ఆర్డీఆర్పీ జన్యువుల ఉనికిని గుర్తిస్తుంది. ఐసీఎంఆర్ పరీక్షల్లో ఈ కిట్.. వైర్సలోని జన్యువుల ఉనికిని గుర్తించడంలో 98.7 శాతం సునితత్వాన్ని, 98.8 శాతం నిర్దిష్టతను ప్రదర్శించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ కిట్ను ఉపయోగించడం కూడా చాలా సులువని దీని రూపకర్తలు చెప్పారు. కాగా.. ఈ ఏడాది చివరినాటికి భారత్, బంగ్లాదేశ్లలో కరోనా మరణాల రేటు 0.5 శాతం కన్నా దిగువకు పడిపోతుందని రిలయన్స్ లైఫ్ సైన్సెస్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మన తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో మరణాల రేటు తగ్గుతుందని తేలింది.
Updated Date - 2020-10-03T08:13:13+05:30 IST