‘బురేవి’ తుపాన్ ఎఫెక్ట్...పలు జిల్లాల్లో రెడ్అలర్ట్
ABN, First Publish Date - 2020-12-01T12:13:32+05:30
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘బురేవి’ వాయుగుండంగా మారడంతో దీని ప్రభావం వల్ల దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ....
తమిళనాడు, ఆంధ్రాలోనూ భారీ వర్షాలు
తిరువనంతపురం (కేరళ): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘బురేవి’ వాయుగుండంగా మారడంతో దీని ప్రభావం వల్ల దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరప్రాంతాల్లో మంగళవారం మరో సారి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నివర్ తుపాన్ వణికించిన వారం రోజులకే బంగాళాఖాతంలో మరో ‘బురేవి’ తుపాన్ ఏర్పడింది. బురేవి తుపాన్ ప్రభావం వల్ల కేరళ, తమిళనాడు ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో మంగళవారం నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశమున్నందున కేంద్ర వాతావరణ శాఖ ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో 24 గంటల్లో 6 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కురవవచ్చని అధికారులు వివరించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, లక్షద్వీప్, దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో డిసెంబరు 1 నుంచి 3వతేదీ వరకు బురేవి తుపాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నివర్ తుపాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చగా, ఆ విపత్తు ముగిసిన వారం రోజులకే మరో బురేవి తుపాన్ ఏర్పడటంతో ప్రజలు కలవరపడుతున్నారు.
కేరళలోని నాలుగు దక్షిణ జిల్లాలైన తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, అలప్పుజ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కేరళలోని కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరంజ్ హెచ్చరిక జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో 24 గంటల్లో 30 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
Updated Date - 2020-12-01T12:13:32+05:30 IST