కరోనా వైరస్ నుంచి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు : రమేశ్ చెన్నితల
ABN, First Publish Date - 2020-04-12T19:15:18+05:30
కోవిడ్ - 19 సంక్షోభం నుంచి పినరాయ్ విజయన్ నేతృత్వంలోని సీపీఎం సర్కారు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని
కేరళ : కోవిడ్ - 19 సంక్షోభం నుంచి పినరాయ్ విజయన్ నేతృత్వంలోని సీపీఎం సర్కారు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల తీవ్రంగా ఆరోపించారు. ఇంతటి సంక్షోభ సమయంలో ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పనిచేయడం లేదా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తాము ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నామని, కానీ ప్రభుత్వం మాత్రం సంక్షోభం నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని, అది చాలా దురదృష్టకరమని చెన్నితల వ్యాఖ్యానించారు.
ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కోవిడ్ - 19 నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టడంలో తాము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని, అయితే సీఎం ప్రకటించిన దానికి, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్ కేవలం ఓ తంతులా మారకూడదని, ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని ఆయన సూచించారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోడానికి ఎమ్మెల్యేల, ఎంపీల వేతనాల్లో కోతలు విధించడానికి తాము సుముఖంగానే ఉన్నామని స్పష్టం చేశారు.
అయితే ఉద్యోగుల నెలసరి జీతంలో మాత్రం బలవంతంగా కోత విధించడానికి మాత్రం తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని తెలిపారు. అత్యవసర విభాగాలైన పోలీసులు, రెవిన్యూ, ఆరోగ్య శాఖల్లో ఉండే ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక, ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాల్లో కోత విధించడంపై ఆయన స్పందిస్తూ... ఎంపీల జీతాలతో పోలిస్తే.. ఎమ్మెల్యేల జీతాలు కొంచెం తక్కువగానే ఉంటాయని, అయినా సరే తాము స్వాగతిస్తామని అన్నారు. అయితే ఎమ్మెల్యేల అభివృద్ధి నిధుల కోతను మాత్రం తాము వ్యతిరేకిస్తామని రమేశ్ చెన్నితల స్పష్టం చేశారు.
Updated Date - 2020-04-12T19:15:18+05:30 IST