రజినీ బ్యాక్ స్టెప్పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ స్టోరీ
ABN, First Publish Date - 2020-12-30T00:36:17+05:30
రజినీ బ్యాక్ స్టెప్పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ స్టోరీ
అందరి అంచనాలు తలకిందులయ్యాయి. కొండంత ఆశతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ దిగాలు పడిపోయారు. రాజకీయంగా హీటెక్కిన వాతావరణం చల్లబడింది. రజనీకాంత్ కొత్త పార్టీ ఎంతెంత దూరం? ఏబీఎన్ స్పెషల్ స్టోరీలో చూద్దాం...
''ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నా. ఆరోగ్యం ప్రాధాన్యమని ఆత్మీయులు సూచించారు. ఎంతో భారమైన హృదయంతో ఈ నిర్ణయం ప్రకటిస్తున్నా. ఇటీవల అనారోగ్య బారినపడటాన్ని దేవుడి సూచనగా భావిస్తున్నా. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇటీవల 120 మంది ఉన్న మా చిత్రబృందంలో కొందరు కరోనాకు గురయ్యారు. అలాంటిది నేను ఎన్నికల బరిలోకి దిగితే లక్షల మంది జనం మధ్యలోకి వెళ్లాలి. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను సాహసం చేయలేను. ప్రజలను ఇబ్బందుల్లో పెట్టలేను. కేవలం సోషల్మీడియా ప్రచారంతో ఏ పార్టీ కూడా గెలవలేదు. అయితే నిజం మాట్లాడటానికి ఎప్పుడూ వెనుకాడను. రాజకీయాలతో సంబంధం లేకుండా నా ప్రజాసేవ నిరంతరం సాగుతుంది.'' ఇదీ.. రజనీకాంత్ తాజాగా చేసిన ప్రకటన సారాంశం.
తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఏర్పాటుపై మరోసారి వెనక్కి తగ్గారు. ప్రస్తుతానికి పార్టీని ప్రారంభించడం లేదని స్పష్టం చేశారు. ఈమేరకు రజనీకాంత్ మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. తన ట్విట్టర్ హ్యాండిల్పై ఈ లేఖను పోస్ట్ చేశారు. 2021 తమిళనాడు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, అభిమానులు తనను క్షమించాలని కోరారు. తనమీద అభిమానంతో, గౌరవంతో నమ్మి వచ్చినవారిని బలి చేయలేనని రజనీకాంత్ ప్రకటనలో పేర్కొన్నారు. తన ఆరోగ్యం సహకరించడం లేదని, కరోనా కూడా తాజా నిర్ణయానికి కారణమని లేఖలో రజనీకాంత్ వెల్లడించారు. అయితే, రాజకీయాల్లోకి తప్పక వస్తానన్న రజనీకాంత్.. ఇప్పుడు మాత్రం అనారోగ్యంతో ఈ ఆలోచన విరమించుకున్నానన్నారు. ఒకవేళ.. రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజాసేవ కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఇటీవల హైదరాబాద్లో షూటింగ్లో ఉన్న సమయంలో రజనీకాంత్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అధిక రక్తపోటు కారణంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన.. రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలో ఇంటికి చేరిన తర్వాత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలని కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాజకీయాల్లోకి అడుగుపెడితే.. ఆరోగ్యపరంగా, మానసికంగా అనేక సమస్యలు తలెత్తుతాయని కొందరు సన్నిహితులు రజనీకాంత్కు సలహా ఇచ్చారని తెలుస్తోంది.
అంతేకాదు.. రజనీ త్వరగా కోలుకునేందుకు వైద్యులు కూడా కొన్ని సూచనలు చేశారని చెబుతున్నారు. వారం రోజుల పాటు రజనీ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కొవిడ్ సోకే అవకాశం ఉన్న ఏ కార్యక్రమంలోనూ పాల్గొన వద్దని సూచించారు. అదే సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని తెలిపారు. గతంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారని సమాచారం. అందరి అభిప్రాయాలతో పాటు.. వైద్యుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న రజినీకాంత్.. ప్రస్తుతానికి పార్టీ పెట్టే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
దాదాపు పాతికేళ్లుగా రాజకీయ పార్టీ గురించి ప్రస్తావిస్తూ వస్తున్న రజనీకాంత్.. ఆ ఎదురుచూపులకు ఇటీవలే తెరదించారు. వచ్చే ఏడాది రాజకీయాల్లోకి వస్తున్నానంటూ డిసెంబరు మొదటివారంలో ప్రకటన చేశారు. పార్టీకి సంబంధించిన వివరాలను, విధివిధానాలను డిసెంబరు 31వ తేదీన వెల్లడిస్తానని చెప్పారు. 'త్వరలో అద్భుతాలు.. ఆశ్చర్యాలు జరుగుతాయి. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు' అని రజనీ ఆసమయంలో ట్విటర్లో పేర్కొన్నారు. దీంతో తమిళ రాజకీయాల్లో ఆసక్తి పెరిగింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకు 'మక్కల్ సేవై కట్చి' పేరుతో తలైవా ఎన్నికల సంఘంలో పార్టీని నమోదు చేసినట్లు, ఆయనకు ఆటో గుర్తు కేటాయించినట్లు కూడా ప్రచారం జరిగింది. అంతేగాక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో రజనీ కొత్తపార్టీ పోటీకి దిగుతుందనే వార్తలు కూడా వచ్చాయి. రాజకీయ పార్టీ గురించి రజనీ చేసిన ఈ ప్రకటనతో తమిళనాట ఆయన అభిమానులు సంబరాల్లో మునిగితేలారు.
అయితే, పార్టీ కార్యాచరణలో మునిగితేలడానికి ముందే తాను ఒప్పుకున్న 'అన్నాత్తై' సినిమా షూటింగ్ను పూర్తి చేయాలని భావించిన సూపర్ స్టార్.. అందుకోసం హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా కొందరికి కరోనా నిర్ధారణ కావడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఈ నెల 25వ తేదీన రజినీకాంత్కు ఉన్నట్టుండి బీపీ పెరగడంతో ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. దీంతో రజనీకాంత్ అభిమానుల్లో ఆయన ఆరోగ్యం గురించి టెన్షన్ మొదలైంది. రెండు రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్.. చెన్నై చేరుకున్నారు. దీంతో.. ఈనెల 31వ తేదీన రజనీ పార్టీ ప్రకటన కోసం ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈనెల మొదటి వారంలో రజనీ స్పష్టమైన ప్రకటన చేయడంతో.. ఈసారి పార్టీ ప్రకటన ఖచ్చితంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ, పార్టీ ఆలోచనను విరమించుకుంటున్నట్లు తలైవా తాజాగా ప్రకటించడంతో.. అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురయ్యింది.
అయితే, పార్టీ కార్యాచరణలో మునిగితేలడానికి ముందే తాను ఒప్పుకున్న 'అన్నాత్తై' సినిమా షూటింగ్ను పూర్తి చేయాలని భావించిన సూపర్ స్టార్.. అందుకోసం హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా కొందరికి కరోనా నిర్ధారణ కావడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఈ నెల 25వ తేదీన రజినీకాంత్కు ఉన్నట్టుండి బీపీ పెరగడంతో ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. దీంతో రజనీకాంత్ అభిమానుల్లో ఆయన ఆరోగ్యం గురించి టెన్షన్ మొదలైంది. రెండు రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్.. చెన్నై చేరుకున్నారు. దీంతో.. ఈనెల 31వ తేదీన రజనీ పార్టీ ప్రకటన కోసం ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈనెల మొదటి వారంలో రజనీ స్పష్టమైన ప్రకటన చేయడంతో.. ఈసారి పార్టీ ప్రకటన ఖచ్చితంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ, పార్టీ ఆలోచనను విరమించుకుంటున్నట్లు తలైవా తాజాగా ప్రకటించడంతో.. అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురయ్యింది.
- సప్తగిరి గోపగోని, చీఫ్ సబ్ ఎడిటర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
Updated Date - 2020-12-30T00:36:17+05:30 IST