పంజాబ్ పోలీసు శాఖ భద్రతా సలహాదారుకు డీఐజీ ర్యాంక్
ABN, First Publish Date - 2020-06-24T04:09:31+05:30
పంజాబ్ పోలీసు శాఖ భద్రతా సలహాదారుగా నియమితుడైన బ్రిగేడియర్
చండీగఢ్ : పంజాబ్ పోలీసు శాఖ భద్రతా సలహాదారుగా నియమితుడైన బ్రిగేడియర్ గౌతమ్ గంగూలీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ర్యాంకు ఇచ్చింది. ఆయన ఈ పదవిలో మూడేళ్ళపాటు ఉంటారు.
ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బ్రిగేడియర్ గౌతమ్ను డీఐజీగా నియమించేందుకు ఆమోదం లభించింది. పదవీ విరమణ పొందిన బ్రిగేడియర్ గౌతమ్ గంగూలీని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దినకర్ గుప్తాకు భద్రతా సలహాదారుగా నియమించేందుకు మంత్రివర్గం అనుమతించింది.
డీజీపీ దినకర్ గుప్తాకు బ్రిగేడియర్ గంగూలీ అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. రాష్ట్రంలో సలహాదారులు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ మందిని సలహాదారులుగా నియమించడం వల్ల ఖజానాపై భారం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
బ్రిగేడియర్ గంగూలీ 33 ఏళ్ళపాటు భారత సైన్యంలో సేవలందించారు.
Updated Date - 2020-06-24T04:09:31+05:30 IST